Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 లక్షల మందికి టోపీ పెట్టి రూ. 1500 కోట్లకు టోకరా
- డైరెక్టర్స్తో సహా 24మంది అరెస్ట్
- ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ పేర భారీ మోసం
- బ్యాంకులో ఉన్న 20 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు
నవతెలంగాణ-మియాపూర్ (గచ్చిబౌలి)
గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 'ఇండస్ వివా' పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా 10లక్షల మంది దగ్గర నుంచి రూ.1500 కోట్ల మేర వసూలు చేసినట్టు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సీపీ సజ్జనార్ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ముగ్గురు ఉండటం గమనార్హం. బెంగళూరుకు చెందిన అభిలాష్ థామస్, ప్రేమ్కుమార్ సహా మరి కొంతమంది ముఠాగా ఏర్పడి బెంగళూరు ప్రధాన కేంద్రంగా 'ఇండస్ వివా హెల్త్ సైన్సెస్' పేరుతో గొలుసుకట్టు వ్యాపారాన్ని ప్రారంభించారు. తమ సంస్థలో రూ.12,500లతో సభ్యత్వం తీసుకొని ఇతరులను చేర్చితే లాభాలు గడిస్తారని ప్రజలను నమ్మిస్తారు. ఇలా వారు ఒకరి నుంచి మరొకరికి గొలుసులా 10 లక్షల మందిని మోసగించి రూ.1500 కోట్ల మేర వసూలు చేశారు. పది రోజుల కిందట ఇండస్ వివాపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో దర్యాప్తు ప్రారంభించి ఈ ముఠాను అరెస్టు చేసినట్టు సీపీ వెల్లడించారు. నిందితులకు చెందిన పలు అకౌంట్లలోని రూ.20 కోట్లను జప్తు చేసినట్టు తెలిపారు. అరెస్టయినవారిలో తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, వారి భార్యలు ఉన్నారనీ, వీరంతా తమ విధులకు సెలవు తీసుకొని మరీ ఈ మోసాలకు పాల్పడ్డట్టు సీపీ వివరించారు. సంస్థ సీఈఓ సహా మొత్తం 24 మందిని అరెస్టు చేశామనీ, చైర్మెన్ పరారీలో ఉన్నట్టు సీపీ వెల్లడించారు. ఇలాంటి గొలుసుకట్టు వ్యాపార మోసాలు రోజురోజుకి రూపం మార్చుకుని ప్రజల మధ్యలో తిరుగుతూనే ఉన్నారనీ, వాటిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఇలాంటి స్కీముల్లో చేరటం వల్ల కుటుంబాలతో ఉన్న సంబంధాలు కూడా ఎన్నో తెగిపోయాయన్నారు. మొదట ఆకర్షణీయంగా కనిపించిన ఈ స్కీములు తర్వాత సమాజంలో వ్యక్తుల గౌరవం పోవడంతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు సైతం గతంలో చూశామని సీపీ ప్రజలకు గుర్తుచేశారు. కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఓటీ పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ కీలకంగా వ్యవహరించి ఈ ముఠా గుట్టు రట్టు చేశారంటూ సీపీ వారిని అభినందించారు.