Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరిన్ని డోసులు పంపించాలంటూ కేంద్రాన్ని కోరాం
- మరణాలను తక్కువ చేసి చూపించడం లేదు : కోవిడ్ వ్యాక్సిన్ చైతన్య వేదిక సదస్సులో మంత్రి ఈటల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత లేనప్పటికీ ఉన్న నిల్వ అయిపోతుందనే భయం మాత్రం ఉందనిరాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కనీసం 30 శాతం జనాభాకు సరిపడా వ్యాక్సిన్ డోసులు పంపించాలంటూ కేంద్రాన్ని ఇప్పటికే డిమాండ్ చేసినట్టు గుర్తుచేశారు. 25 ఏండ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని తాజాగా ప్రతిపాదనలు పంపించినట్టు తెలిపారు. ఆదివారం కోవిడ్ వాక్సిన్ చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు డిజి నర్సింహారావు అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాక్సిన్ సరఫరా, ఎవరికి ఇవ్వాలి, ఎంతివ్వాలి? తదితర విషయాలన్నీ కేంద్రం పరిధిలోనే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతమున్న కరోనా రూపానికి తగినట్టు వ్యాక్సిన్లు వచ్చాయనీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్ని ప్రభావవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు సందేహాలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. కోవిడ్-19 రోగుల మరణాల విషయంలో తప్పుడు లెక్కలు చూపిస్తున్నామ నటంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు.
మనిషికి భద్రత కల్పించటంలో ప్రపంచం విఫలం..
సగటు మనిషికి కరోనా నుంచి భద్రత కల్పించటంలో ప్రపంచం విఫలమైందని మంత్రి అభిప్రాయపడ్డారు. వలసకూలీలు లక్షలాదిగా మరణించారు. ఇప్పటికీ రెక్కాడితే గాని డొక్కాడక ఆకలితో అలమటించే ప్రజలెంతో మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాలు కరోనాతో వణికిపోయాయని తెలిపారు. భూతల స్వర్గంగా భావించే అమెరికా సైతం భయపడిపోయిందన్నారు. సాంకేతికంగా ఎంతో ప్రగతిని సాధించిన యూరోపియన్ దేశాలు తల్లడిల్లిపోయాయి. బ్రెజిల్, అమెరికా, ఇటలీ లాంటి దేశాలు తలలు పట్టుకున్నాయని గుర్తుచేశారు. చైనా దేశం కాబట్టే తట్టుకొని నిలబడ గలిగిందనీ, భారతదేశానికి వస్తే ఎలా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయినా మన దేశం కూడా నిలబడిందని ఈటల అన్నారు. రాష్ట్రంలో మొదటి పేషెంటు గాంధీలో చేరే సమయానికి దగ్గరికి వెళ్లేందుకు వైద్యసిబ్బంది భయపడుతున్న వేళ తాను పరామర్శించి ఏమి కాదంటూ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా రాకతో మానవ సంబంధాలు బూటకమని తేలిపోయిందన్నారు. నిజమైన మందు ధైర్యమేనని హితవు పలికారు. స్వీయ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు సూచించారు. బంద్ పెట్టడం పరిష్కారం కాదని తేల్చిచెప్పారు.
మహమ్మారులకు విరుగుడు మాస్కులు, భౌతిక దూరమే : డాక్టర్ విజరు వి.యెల్దండి
ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ విజరు వి.యెల్దండి మాట్లాడుతూ వందేండ్ల క్రితం వచ్చిన ఇన్ ఫ్లూయెంజాను నాటి సమాజం కేవలం మాస్కులు, భౌతిక దూరం పాటించటం ద్వారా ఎదుర్కొన్నదని గుర్తుచేశారు. వ్యాక్సిన్లలో ఏది మంచిదంటూ కాలయాపన చేసే కన్నా ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవటం మంచిదని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొద్దిపాటి నీరసం, జ్వరం కొంత మందిలో వస్తాయని, ఇదంతా ఏ వ్యాక్సిన్కైనా సాధరణమేనని వివరించారు. వదంతులను నమ్మవద్దనీ, ఐసీఎంఆర్ లాంటి శాస్త్రీయ సంస్థలు ఇచ్చే సమాచారంతో నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలను కోరారు. చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ జబ్బు వచ్చే అవకాశం లేదన్నారు. అయితే ఇన్ఫెక్షన్లు సోకుతాయని తెలిపారు. ముందుగా చనిపోయే ప్రమాదం ఉన్న వారికి వ్యాక్సిన్లు ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వటం సరైన నిర్ణయమని సమర్థించారు. అందరికీ సరిపడా వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి సమస్య కాదనీ, అంత మొత్తంలో ఉత్పత్తి అయితే దాన్నిసరఫరా చేసే వ్యవస్థ లేదన్నారు. యాంటీబయోటిక్స్ కరోనాకు ఉపయోగపడతా యని రుజువు కాలేదన్నారు. కాలేయానికి సంబంధించి సీరియస్గా ఉన్న రోగులకు పారాసెటిమల్ పని చేయదని తెలిపారు. ఆల్కహాల్, పారాసెటిమల్ కలిస్తే కాలేయాన్ని మరింత దెబ్బతీస్తాయని హెచ్చరించారు.
3 నెలల్లో వంద క్యాంపులు : డిజి నర్సింహారావు
రాబోయే మూడు నెలల కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో వంద క్యాంపులను నిర్వహించనున్నట్టు డిజి నర్సింహారావు తెలిపారు. వేదిక ద్వారా వ్యాక్సిన్పై చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నామనీ, వాలంటీర్లుగా సేవందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు, యువజనలు, పౌర సమాజం తదితరులతో ఈ ఉమ్మడి వేదిక ఆవిర్భవించిందని తెలిపారు. అవగాహన శిబిరాల వద్ద వ్యాక్సినేషన్ చేసేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వేదిక రాష్ట్ర నాయకులు మహ్మద్ అబ్బాస్, ఆర్.వరప్రసాద్, లోకేశ్ రెడ్డి, ముకుంద్ కులకర్ణి, కోటయ్య, నర్సిరెడ్డి, అరుణజ్యోతి, కుమార్, కె.రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.