Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాఫీసులకు భగీరథ వాటర్ బాటిళ్ల సరఫరా బంద్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు మిషన్ భగీరథ వాటర్ బాటిళ్ల సరఫరా నిలిచిపోయింది. తద్వారా సర్కారు లక్ష్యం మున్నాళ్ల ముచ్చటేగా మారిందన్న చర్చ అధికారుల్లో నడుస్తున్నది. బాటిళ్ల తయారుచేసే ప్రయివేటు కంపెనీ చేతులెత్తేయడంతో గత నెలరోజులుగా ప్రభుత్వాపీసుల్లో భగీరథ తాగునీటి బాటిళ్లు కనుమరుగయ్యాయి. మార్కెట్లో అమ్మే సాధారణ మినరల్ బాటిళ్ల తరహాలోనే శుద్ధమైన భగీరథ నీళ్లతో బాటిళ్లను తయారుచేస్తున్నట్టు భగీరథ కార్పొరేషన్ గత జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ నీటిని ఇప్పటికే సాధారణ ప్రజలకు నల్లాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నారు. అలాగే ప్రభుత్వాఫీసులకు బాటిళ్ల ద్వారా భగీరథ నీటిని అందించాలని కార్పొరేషన్ భావించింది. ఆ నేపథ్యంలో చురుగ్గా చర్యలు తీసుకుంది. ఒక్కో బాటిల్ పరిమాణం 250 మిల్లిలీటర్లు. దీని తయారీకి దాదాపు ఆరు రూపాయలు ఖర్చవుతున్నట్టు ఆర్డబ్ల్యూఎస్ శాఖ చెబుతున్నది. ఈ బాటిళ్ల తయారీ కోసం మెదక్ జిల్లా సింగూరులో కొత్త బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనీ కార్పొరేషన్ నిర్ణయించింది. ఆమేరకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యేలోగా మరో ప్రయివేటు కంపెనీకి బాటిళ్ల తయారీ కాంట్రాక్టును అప్పగించింది. గత రెండు నెలల క్రితం కొంత పరవాలేదనే స్థాయిలోనే తయారీతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు భగీరథ తాగునీటిని సరఫరా చేశారు. కాగా తయారీ బాధ్యతలు తీసుకున్న ప్రయివేటు కంపెనీ రకరకాల కారణాలతో బాటిళ్లు తయారుచేయలేనని తేల్చిచెప్పేసింది. కంపెనీ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయనీ, అందుకే బాటిళ్ల తయారీ సమస్యగా మారిందని అంటున్నది. వాటర్ బాటిళ్ల తయారీ త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తామనీ, తాత్కాలిక సాంకేతిక సమస్యల మూలంగా బాటిళ్ల తయారీ ఆగిపోయినట్టు భగీరథ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. బాటిళ్ల తయారీ నిలిచిపోవడంతో ప్రభుత్వ శాఖలకు గత నెలరోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అసలే ఎండాకాలం కావటంతో..దాహార్తి తీర్చుకోవటానికి బయటి కంపెనీల నీటి సీసాలను తెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.