Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రెంచ్ పనుల కోసం వెళ్లిన ముగ్గురు ఎఫ్బీఓలపై దాడి
- చెట్టుకు కట్టేసిన పోడుదారులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అటవీ సిబ్బందిపై పోడు సాగుదారులు ఆగ్రహించారు. ఏండ్ల తరబడి అడవులను నమ్ముకుని పోడు కొట్టి సాగు చేసుకుంటున్న భూముల చుట్టూ ట్రెంచ్ వేస్తారా అంటూ నిలదీశారు. డోజర్ ట్రాక్టర్తో పనులు నిర్వహిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ని చితక బాదారు. ముగ్గురు అటవీ సిబ్బందిపై దాడి చేయడంతోపాటు, డి కొత్తూరు బీట్ ఆఫీసర్ రాజేష్ను చెట్టుకు కట్టేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో జరిగింది. దుమ్ముగూడెం అటవీ రేంజి పరిధిలోని డి కొత్తూరు బీట్లో చింతగుప్ప అటవీ ప్రాంతంలో అటవీ సిబ్బంది ఇటీవల ట్రెంచ్ పనులు చేపట్టారు. ఉన్నతాధికారులు వస్తున్నారనే సమాచారం మేరకు ట్రెంచ్ పనుల వద్దకు వాహనాలు వెళ్లేందుకు డోజర్ ద్వారా సోమవారం ఉదయం పనులు చేపట్టారు. ఆ సమయంలో చింతగుప్ప గ్రామానికి చెందిన పోడు సాగుదారులు అక్కడికి చేరుకున్నారు. ట్రాక్టర్ ద్వారా పనులు చేస్తున్న డ్రైవర్ నాగేశ్వరావును చితక బాదారు. దీంతో డ్రైవర్ నాగేశ్వరరావు డి కొత్తూరు బీట్ ఆఫీసరు రాజేష్కు ఫోన్ చేసి తెలిపాడు. రాజేష్తో పాటు సుజ్ఞ్నాపురం, జిన్నెలగూడెం ఎఫ్బీఓలు విజయ, హుస్సేన్ సంఘటనా స్థలానికి వెళ్లారు.
అక్కడే ఉన్న పోడు సాగుదారులు అటవీ సిబ్బందిని చుట్టు ముట్టడంతో పాటు కట్టెలతో దాడి చేశారు. ఎఫ్బీఓ రాజేష్ను తాడుతో చెట్టుకు కట్టేశారు. విషయం తెలుసుకున్న చింతగుప్ప సర్పంచ్ కట్టం క్రిష్ణ సంఘటనా స్థలానికి వెళ్లి రాజేష్ను విడిపించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఈ ప్రాంతంలో పర్యటించి ఫారెస్టు అధికారులు పోడు భూముల జోలికి వెళ్లొద్దని చెప్పిన రెండ్రోజులకే ఈ సంఘటన జరగడం గమనార్హం. ఎఫ్బీఓలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.