Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ - ఆలేరుటౌన్
ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వస్తే వారి సమస్యలు తెలుస్తాయని సీపీఐ(ఎం) యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్ అన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన జన చైతన్య పాదయాత్ర మంగళవారం ఆలేరులో పర్యటించింది. ఈ సందర్భంగా స్థానిక దినేష్ గార్డెన్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర బృందం ప్రజల వద్దకు వెళ్తుంటే పాలకుల బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సమస్యలపై చర్చించేందుకు ప్రజల మధ్యలో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జిల్లాలోని ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. మూసీ నది ప్రక్షాళన చేయాలని వాజ్పేయి పాలనలో నిర్ణయించారని, కానీ నేటి వరకూ చేయలేదన్నారు. మిషన్ భగీరథ నీరు ఇంటింటికీ అందడం లేదన్నారు. మంచి నీరు కొనేందుకు ప్రతి కుటుంబం రూ.2000 నుంచి రూ.3 వేల వరకూ ఖర్చు చేస్తుందని చెప్పారు. ఆలేరు ప్రభుత్వాస్పత్రిని 100 పడకలకు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఐపీ సేవలు వెంటనే ప్రారంభించాలన్నారు. అనంతరం పాదయాత్ర బృందం సభ్యులకు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మంగ నర్సింహులు ఆధ్వర్యంలో దాత రమేష్ సహకారంతో మెమెంటోలు అందజేశారు. పార్టీ పట్టణ కార్యదర్శి ఎంఏ.ఎక్బాల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొండమడుగు నర్సింహా, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ధారావత్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.