Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మెన్ లోక్నాథ్ రెడ్డి
- జీవనధార ఫార్మసీ ప్రారంభం
- జనరిక్ మందుల విషయంలో ఎలాంటి అపోహలూ వద్దు
నవతెలంగాణ - మహబూబ్నగర్ప్రాంతీయప్రతినిధి
సదుర్ల గోపాల్ అందరికీ ఆదర్శప్రాయుడని జెడ్పీ చైర్మెన్ లోక్నాథ్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సదుర్ల గోపాల్ స్మారకంగా ఏర్పాటు చేసిన జీవనధార ఫార్మసీని మంగళవారం ఎస్వీకే కార్యదర్శి ఎస్.వినయకుమార్, డాక్టర్ మురళీధర్తో కలిసి జెడ్పీ చైర్మెన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ద్వారా నిర్వహించే జీవనధార ఫార్మసీ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చాలా సింపుల్గా ఉండే గోపాల్ పేరు మీద ఫార్మసీ ప్రారంభించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆయన నిజాయితీపరుడని, నమ్మకస్తుడని కొనియాడారు. డాక్టరు మురళీధర్ మాట్లాడుతూ.. జనరిక్ మందుల సామర్థ్యానికి, బ్రాండెడ్ కంపెనీలకు తేడా ఉండదన్నారు. జనరిక్ మందుల విషయంలో ఎవరికెలాంటి సందేహాలూ అవసరం లేదన్నారు. మందుల కంపెనీలు, అమెరికాకు చెందిన కంపెనీలు రూ.10 పైసల ఖరీదు ఉంటే రూపాయికి అమ్ముతారని, మెడికల్ ఏజెంట్లు, డాక్టర్లు వీళ్లంతా కంపెనీలకు ఏజెంట్లుగా మారారని అన్నారు. ఒక డాక్టరుగా తానీ విషయాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినయకుమార్ మాట్లాడుతూ.. విజ్ఞాన కేంద్రం ఒక నిర్ణయం తీసుకుందని, ఎవరైనా రూ.లక్ష విరాళంగా ఇస్తే వారి పేరునగానీ, వారు సూచించే వారి పేరుమీదగానీ ఒక మందుల షాపు ఏర్పాటు చేసేలా నిర్ణయించిందన్నారు. సందీప్కుమార్-లావణ్య దంపతులు రూ.లక్ష విరాళంగా ఇవ్వడంతో వారి తాత సదుర్ల గోపాల్ పేరు మీద జీవనాధార ఫార్మసీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అంతకుముందు సదుర్ల గోపాల్ రాసుకున్న ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ. జబ్బార్, సీఐ సూర్యానాయక్, పట్టణ ఎస్ఐ వెంకటేష్ గౌడ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.