Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీగానే మిగిలిన భూ పంపిణీ
- సర్కార్లో మగ్గుతున్న లక్షల అర్జీలు
- పంచింది ఆరువేల మందికే ..
- ఇచ్చింది 16వేల ఎకరాలే..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
2014 ఏప్రిల్ 24 ఎన్నికల ప్రచార సభలో... దళిత కుటుంబానికి మూడెకరాల భూమిస్తా. నీటి వసతి కల్పిస్తా. అవసరమైన పెట్టుబడిని ఓ ఏడాది ఫ్రీగా ఇస్తమని చెప్పిన.. కొంత మంది తెలివితక్కువ తనంతో యాడికెళ్లి ఇత్తవ్ కేసీఆరూ..అన్నరు. యాడికెళ్లి ఇత్తం. మనసుంటే మార్గముంటది.
- 2014 సెప్టెంబర్... లక్ష దళిత కుటుంబాలకు రాబోయే నాలుగేండ్లలో కచ్చితంగా మూడెకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పిన.
- 2017 మార్చి17న అసెంబ్లీలో.. మొత్తమే లేనోళ్లకు మూడెకరాలు కొనమన్నం. ఎకరం ఉన్నోళ్లకు రెండెకరాలు కొనమంటం. రెండున్నొళ్లకు మూడు చేయమంటం. ఎన్ని అప్పికేషన్లు తెచ్చిచ్చినా ఇయ్యటానికి మెం సిద్దం.
- 2020 సెప్టెంబర్ 11న అసెంబ్లీలో..భవిష్యత్లో భూములు పంచుతమని అంటున్నరు. లేదు. వట్టి సంచికాడ కొట్లాట.. ఖజానా ఉంటే కదా..పంచేది. భూములు పంచుతామని ఇంతకు ముందు పార్టీలు చెప్పినట్టు అబద్దాలు చెప్పం. ఓట్లప్పుడు చెప్పి తర్వాత ఇంకోటి చెప్పే అలవాటు మాకు లేదు. భూ పంపిణీపై ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు ఇది.
దళితులకు మూడెకరాల భూ పంపిణీ హామీ మూడడుగులు ముందుకు ఏడడగులు వెనక్కి అనే చందంగా ఉన్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో సెంటు భూమి లేని దళిత కుటుంబాలు 3.30 లక్షల మందికిపైగా ఉన్నాయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్న కేసీఆర్..భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని పదేపదే హామీ ఇచ్చారు. భూములు పంచడమే కాకుండా అభివృద్ధి చేసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. ఎకరం ఉన్నోళ్లకు రెండెకరాలు, రెండెకరాలు ఉంటే ఇంకో ఎకరం..ఇలా ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు.
2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టీ, ఎన్నికల ప్రచార సభలన్నింటా ఇదే ఎజెండాపై ఫొకస్ చేశారు. ఎంతమందికైనా భూమి ఇచ్చేందుకు సిద్దమంటూ హామీనిచ్చారు. సీఎం అయ్యాక అదే ఏడాది ఆగష్టులో ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ..ఆచరణలో ఈ పథకం అట్టర్ప్లాఫ్ అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అర్జీలు లక్షల్లో..పంపిణీ వేలల్లో ..
దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని 2014 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో రెండు లక్షలకు పైగా దళిత కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. సర్కారు మాత్రం ఈ ఆరున్నరేండ్ల కాలంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 6,337 కుటుంబాలకు 16 వేల ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేసింది. ఇంకా 97శాతం మంది భూమిలేని వారున్నారని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి.. ఈ విషయాన్ని సమగ్ర కుటుంబ సర్వే సైతం గుర్తించింది. దరఖాస్తులు చేసుకుని ఏండ్లు గడుస్తున్నా..భూ పంపిణీ జరగకపోవడంతో నిరుపేద దళితుల్లో ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అర్జీదారుల్లో ఆందోళన...
రాష్ట్రంలో 3.30 లక్షల మంది దళిత కుటుంబాలకు భూములు లేనట్టు సర్కార్ మొదట్లో చెప్పింది. వాస్తవంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉన్నది. ప్రభుత్వ భూమి లేకపోతే భూములు కొని పంపిణీ చేసేందుకు పథకానికి శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగానే ఈ పథకాన్ని ల్యాండ్ పర్చేజ్ స్కీమ్గా పేరు మార్చింది. గత ఆరేండ్లలో రూ.665 కోట్లను ఈ పథకం కింద ఖర్చుపెట్టింది. ప్రస్తుతం దీని అమలు తీరులో తీవ్ర జాప్యం కొనసాగుతున్నది. ఇదేమిటని అడిగితే..ప్రభుత్వ భూములు లేవని సర్కార్ బుకాయిస్తున్నది. ఆర్థిక పరిస్థితి ఆందోళనగా ఉందని చెబుతున్నది. అదే నిజమైతే..పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు వందలు వేల ఎకరాలు అప్పనంగా అప్పజెప్పడమేకాక, అనేక అవసరాల పేరుతో బడా వ్యాపారులకు ప్రభుత్వ భూములను కారుచౌకగా ఇస్తున్న వైనాన్ని దళిత సమాజం గమనిస్తున్నదని సామాజిక సంఘాలు చెబుతున్నాయి.దేవాలయాలకు, ఇతరత్రా ఖర్చులకు వందల వేల కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దళితుల భూములకు ఎందుకు ఖర్చు చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.