Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే, ఎమ్బీవీకే వెబినార్లో మాడభూషి శ్రీధరాచార్యులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం రాజ్యాంగ విరుద్ధమని పూర్వ కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం (ఎస్వీకే), విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎమ్బీవీకే) సంయుక్తాధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా 'ప్రభుత్వరంగం - సామాజిక న్యాయం - అంబేద్కర్ దృక్పథం' అంశంపై ఆదివారం జరిగిన వెబినార్లో ఆయన ప్రధాన ఉపన్యాసకులుగా మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మేయడమంటే వ్యాపారం చేయడం కాక మరేంటని ప్రశ్నించారు. ఈ దేశానికి నెహ్రూ, ఇందిరాగాంధీ ఏం చేశారంటూ సోషల్ మీడియాలో బీజేపీ శ్రేణులు అడుగుతున్నాయనీ, వారు దేశానికి అందించిన జాతి సంపదనే, నేడు అమ్ముకుంటున్నారనే వాస్తవాన్ని గ్రహించాలని చెప్పారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఉన్నంతకాలం ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మే హక్కు ప్రభుత్వాలకు లేదన్నారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ను వందశాతం అమ్మేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిందనీ, ఆ హక్కు వారికి లేదన్నారు. జాతి సంపదను దోచిపెట్టడమంటే రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయడమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ పరిరక్షణ బాధ్యత ప్రజా ప్రతినిధులదేననీ, ఎన్నికల్లో గెలిచిన వారు, తమకు టిక్కెట్లు ఇచ్చిన పార్టీల తరఫున నిలుస్తారో, ఓట్లు వేసి గెలిపించిన ప్రజల పక్షాన ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. కొందరి చేతుల్లోనే మొత్తం సంపద కేంద్రీకృతం చేస్తూ, ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మడం చేయరాదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 చెప్తున్నదని తెలిపారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నప్పుడు, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. కార్యక్రమానికి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం ట్రస్ట్ ఇంచార్జి రామరాజు, సభ్యులు తులసీరావు పాల్గొన్నారు.
అంబేద్కర్కు దండేసే అర్హత బీజేపీకి లేదు : కేవీపీఎస్
అంబేద్కర్ విగ్రహానికి దండేసే అర్హత బీజేపీకి, మనువాదులకు లేదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) విమర్శించింది. బుధవారం చిక్కడపల్లి కేవీపీఎస్ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ 130వ జయంతి వేడుకల సందర్భంగా ఆ సంఘం నగర నాయకులు జి.రాములు అధ్యక్షతన సభ నిర్వహించారు.. అంతకు ముందు ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ నగర నాయకులతో కలిసి ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, కేవీపీఎస్ నగర కార్యదర్శి కొమ్ము విజరు కుమార్, కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరుశురాం, ఉపాధ్యక్షులు బొల్లి స్వామి, గండి కృష్ణ, విశ్వ నాధ్, బన్నీస్టార్, నరేష్ పవన్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ ఫలాలను అందించిన మహానీయుడు : స్పీకర్ పోచారం
రాజ్యాంగ ఫలాలను దేశ ప్రజలకు అందించిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. అంబేద్కర్ ఏ కులానికో, ఏ మతానికో ప్రతినిధి కాదనీ, యావత్ భారతదేశానికి ఆదర్శమైన నాయకుడు అని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ చూపిన మార్గంలో పని చేస్తే ఏ వర్గానికి కూడా సమస్యలు ఉండవని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, పలువురు శాసనసభ్యులు, మండలి సభ్యులు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు పాల్గొన్నారు.
మతోన్మాదుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి : అబ్బాస్
మతోన్మాదుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే అంబేద్కర్కు ఇచ్చే నిజమైన నివాళి అని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ అన్నారు. ఆవాజ్ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర నాయకులు అబ్దుల్ సత్తార్, ఇఫ్తేఖార్ పాల్గొన్నారు.
సమ సమాజం నిర్మించడమే అంబేద్కర్కు నివాళి : వ్యకాస
ఆర్ధిక ,సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి సమసమాజాన్ని నిర్మించడమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు అర్పించే నిజమైన నివాళి అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రసాద్ అన్నారు. హైదరాబాద్లోని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని బుధవారం నిర్వహించారు.
నవభారత నిర్మాణంలో పాల్పంచుకోవాలి : మంత్రి అల్లోల
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించిన మార్గంలో నడుస్తూ నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో అటవీ శాఖ రాష్ట్ర కార్యాలయం(అరణ్యభవన్)లో అంబేద్కర్ జయంతిని బుధవారం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మెన్ లోకా భూమారెడ్డి, డీఎఫ్వోలు, ఇతర అధికారులు పూలమాల వేసి నివాళి అర్పించారు.