Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంగా కేసీఆర్ అసమర్థుడు :కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్
నవతెలంగాణ - నల్లగొండ
కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై బెదిరింపులు, దాడులకు పాల్పడితే ఖబడ్దార్ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలను మరోసారి భయపెట్టాలని చూస్తే దెబ్బకు దెబ్బ వేస్తామన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఆయన నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి నివాసంలో బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సాగర్లో జానారెడ్డికి ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేక టీఆర్ఎస్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడి కాంగ్రెస్ నేతలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలెవరూ ధైర్యం కోల్పోవొద్దని సూచించారు.
ప్రజా సమస్యలను గాలికొదిలిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికల వేళ డబ్బు సంచులు తీసుకొచ్చి ఓట్లు కొంటున్నారన్నారు. 2019 ఎన్నికల్లో సొంత బిడ్డను గెలిపించుకోలేని అసమర్థ కేసీఆర్..నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వారి అభ్యర్థిని ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ వారి ఇంట్లో నుంచి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. 1200 మంది యువత చనిపోతే చలించి సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణలో.. మళ్లీ యువత ఉద్యోగాల కోసం ప్రాణాలు తీసుకుంటుండం బాధాకర విషయమన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్లే రాష్ట్రంలో నిరుద్యోగులు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. 7.5 శాతం పీఆర్సీ ఇస్తానంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడగొడుతామని ఉద్యోగులు భయపెట్టి 30 శాతం పీఆర్సీ సాధించుకున్నారన్నారు. ప్రశ్నించే గొంతుక ఉంటే సర్కార్ ఓళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తుందని తెలిపారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని గెలిపించాలని కోరారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. జానారెడ్డి హయాంలోనే ప్రతి గ్రామానికీ ఇందిరమ్మ ఇండ్లు, రోడ్లతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయన్నారు. ఇప్పటి వరకూ నాగార్జునసాగర్లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా నిర్మించలేదన్నారు. అనంతరం మర్రిగూడ బైపాస్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఎంపీపీ మణి మధ్యే సుమన్, జెడ్పీటీసీ లక్ష్మయ్య, కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు గుమ్ముల మోహన్రెడ్డి, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.