Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర సారధి ఎండి.జహంగీర్
నవతెలంగాణ - రాజాపేట
రాజాపేట మండలానికి గంధమల్ల ప్రాజెక్టు నీరు వస్తుందని ఆశపడిన ప్రజలకు నిరాశే మిగిలిందని సీపీఐ(ఎం) యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సీపీఐ(ఎం) చేపట్టిన జనచైతన్య పాదయాత్ర బుధవారం రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామానికి చేరుకుంది. పాదయాత్ర బృందానికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. సీపీఐ మండల శాఖ పూర్తి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సభలో జహంగీర్ మాట్లాడుతూ.. 30ఏండ్లుగా రాజాపేట మండలాన్ని ఎడారిగా మార్చారన్నారు. గంధమల్ల ప్రాజెక్టును 9 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని చెప్పి ఎందుకు విస్మరించారని, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే గొంగిడి సునీత పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. 2018 ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చే డిసెంబర్ కల్లా గోదావరి జలాలు బ్రాంచ్ కెనాల్ ద్వారా మండలానికి ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి ప్రాజెక్ట్ను సాధించాలన్నారు. లేనిచో గంధమల్ల ప్రాజక్టు సాధన కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రారంభించి పోరుబాట పడతామని హెచ్చరించారు. అదేవిధంగా తపస్పల్లి ప్రాజెక్టు ద్వారా కూడా ఈ ప్రాంతానికి నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో జూనియర్, ఐటీఐ కళాశాలలను ఏర్పాటు చేసి విద్య అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. చేనేత కార్మికులకు వ్యక్తిగత రుణాలు ఇచ్చి ఆదుకోవాలని, రైతుబంధు పథకం లాగానే చేనేతబంధు పథకం ప్రవేశ పెట్టాలని కోరారు. కళ్యాణ లక్ష్మి పథకంలో చేనేత చీరను జత చేయాలనిన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో మార్కెట్ లేక మద్దతు ధర రాక చిన్న, సన్నకారు రైతులు హరి గోస పడ్తారన్నారు. ఈ నెల 22న జిల్లాలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృందం సభ్యులు కొండమడుగు నర్సింహ, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, మాటూరిబాల్రాజు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, రమేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.