Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగంపై పాలక పార్టీలు చేస్తున్న దాడిని వెనక్కి కొట్టి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. అంబేద్కర్ చిత్ర పటానికి ఎస్. వీరయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని, సమానత్వాన్ని గాఢంగా విశ్వసించారనీ, కుల, మత, లింగ, జాతి బేధాలు, ఆర్థిక, సామాజిక అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నారని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల కోసం, వారి హక్కుల కోసం పరితపించారన్నారు. హిందూ కోడ్ బిల్లు కోసం, హిందూ కుటుంబాల్లో స్త్రీల వారసత్వ హక్కు కోసం, సామాజిక న్యాయం కోసం తన మంత్రి పదవికే రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అన్నారు. కానీ, నేడు దేశ ప్రజల్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం స్త్రీలను వంటింటి పనిమనిషిగానే పరిగణిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగం స్థానంలో మనుధర్నాన్ని తీసుకురావాలని ఆర్ఎస్ఎస్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందన్నారు. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులకు నేడు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాతంత్ర శక్తులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, దళితులు, గిరిజనులు ఒక్కతాటిపైకి వచ్చి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. మతోన్మాద, మితవాద శక్తులను అంతం చేసి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడమే అంబేద్కర్కు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ. రమణ, మత్య్స కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లల బాలకృష్ణ, జీఎంపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, పి. శ్రీకాంత్, ఎ. సునీత, తదితరులు పాల్గొన్నారు.