Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని క్యాడర్లలో సర్కారుపై అసంతృప్తి..
- ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చిన జూడాలు
- డాక్టర్ల కార్యాచరణ షురూ
- ఆందోళన బాటలో నర్సులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచమంతా వారివైపు చూస్తున్నది. మానవాళిని కరోనా నుంచి కాపాడే ప్రత్యక్ష దైవాలుగా భావిస్తున్నది. వారి సేవలను శ్లాఘిస్తున్నది. కరోనా నేపథ్యంలో ఆశావర్కర్లు మొదలుకొని స్పెషలిస్టు వైద్యుల వరకు సమాజంలో వైద్య సిబ్బంది అందరికీ డిమాండ్ పెరిగింది. ఇక కార్పొరేట్ ప్రపంచమైతే ఇదే అదనుగా బెడ్ల సంఖ్యను పెంచుకుంటూ అందుకు తగినట్టు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టింది. ఇప్పటికే వేలాది పడకలతో విరాజిల్లుతున్న రాష్ట్రంలోని కార్పొరేట్ ఆస్పత్రులు వాటికి అనుసంధానంగా స్టార్ ఆస్పత్రులను కోవిడ్ కేర్ సెంటర్లుగా, ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని భారీ పారితోషికాలతో ఆకర్షిస్తున్నాయి. గతంలో ఒక నర్సుకు ప్రారంభంలో నెలకు రూ.12,000 నుంచి రూ.15,000కు మించి ఇచ్చేందుకు ఇష్టపడని ఆస్పత్రులు సైతం ఇప్పుడు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఆఫర్ చేస్తుండటం గమనార్హం. ఇక స్పెషలిస్టు డాక్టర్లకైతే లక్షల్లో చెల్లించేందుకు వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 50 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామకానికి ఆఫర్ చేసిన జీతాలపై అందరూ పెదవి విరుస్తున్నారు. మరోవైపు ఇప్పటికే విధుల్లో ఉన్న సిబ్బంది గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖలో ఆశావర్కరు మొదలుకొని పైస్థాయిలో డైరెక్టర్ వరకు దాదాపు 120 క్యాడర్లలో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా సమయంలో చికిత్స చేస్తూ అదే వ్యాధి బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నిమ్స్ తో పాటు ప్రతి జిల్లాలో ప్రత్యేక వార్డులను వైద్యారోగ్యసిబ్బంది చికిత్సకు కేటాయించాలని మొదట్నుంచి డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ బారిన పడిన సమయంలో సమయానికి చికిత్స దొరకక సహచరులు మరణిస్తుండటంతో సిబ్బందిని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మరణించిన కరోనా వారియర్ల కుటుంబాలకు కేంద్రం ప్రకటించిన రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాకు తోడు రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి రూ.ఒక కోటి ఇవ్వాలని కోరుతున్నారు. క్వారంటైన్ సెలవులు, రవాణా సదుపాయం, సిబ్బంది కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. జూనియర్ డాక్టర్లు ఇన్సెంటివ్ పెంచాలని కోరుతున్నారు. మరోవైపు వారు ఏండ్ల తరబడి పని చేస్తున్న కాంట్రాక్టు నర్సులు, పారామెడికల్ సిబ్బందిని పర్మినెంట్ చేయకపోవటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా నియామకాల సందర్భంగా కరోనా సమయంలో పని చేసే వారికి భవిష్యత్తులో రెగ్యులర్ రిక్రూట్ మెంట్ లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం విదితమే. అయితే అంతకన్నా ముందు ప్రాణాలను పణంగా పెట్టి విధుల్లో చేరే వారికి డిమాండ్ కు తగినట్టు వేతనాలు ప్రకటించాలని కోరుతున్నారు. తాజాగా ప్రభుత్వం నెలకు ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.17 వేలు, నర్సులకు రూ.21 వేలు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ కు రూ.35 వేలు, ఎంబీబీఎస్ అర్హత కలిగిన మెడికల్ ఆఫీసర్ కు రూ.45 వేలు, స్పెషలిస్టు వైద్యునికి రూ.ఒక లక్ష పారితోషికంగా చెల్లించనున్నట్టు పేర్కొంది. ఉద్యోగ భద్రత లేకుండా కేవలం కాంట్రాక్టు ప్రాతిపదికన కొద్ది కాలం కోసమే అంటూ ప్రభుత్వం ప్రకటించటం మొక్కుబడి చర్యే తప్ప పెద్దగా ఫలింత ఉండబోదనే భావన వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలనీ, కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేసి భరోసా కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జూడాలు, నర్సులు, డాక్టర్లు వేర్వేరుగా, ఉమ్మడిగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కరోనా రెండో దశ నేపథ్యంలో రోగులకు ఇబ్బంది కలగకుండా తమ హక్కులను సాధించుకోవాలని భావిస్తున్నారు.
లోపాలను ఎత్తి చూపిస్తే బదిలీ చేస్తారా?: జూడాల వార్నింగ్
టిమ్స్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు అరుంధతి, డాక్టర్ వాసే వాసిం కబీర్ లను ఆదిలాబాద్ కు బదిలీ చేయడం పట్ల తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి.నవీన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. డీఎంఈకి సరెండర్ చేయటం, ఆదిలాబాద్ కు బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలనీ, లేదంటే తమ సత్తా ఏంటో చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు.
నర్సుల రుణం తీర్చుకోలేం... :గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్... రాష్ట్రంలోని నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు.