Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటా 50 లక్షల టన్నుల ఉత్పత్తి పెంపు సింగరేణి సీఎమ్డీ ఎన్ శ్రీధర్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సింగరేణి కాలరీస్లో వచ్చే మూడేండ్లలో 10 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ సీఎమ్డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, అనుమతులపై ప్రతి నెలా సమీక్ష చేస్తామన్నారు. సోమవారంనాడాయన హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరామ్, డి సత్యనారాయణరావు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. 2021-22 లో జీడీకే కోల్ మైన్ నుంచి ఏడాదికి 30 లక్షల టన్నులు, నైనీ బొగ్గు బ్లాక్ (ఒడిశా) నుంచి 100 లక్షల టన్నులు, తర్వాతి ఏడాదిలో వీకే కోల్ మైన్ నుంచి 53 లక్షల టన్నులు, ఆర్జీ కోల్ మైన్ (జీడీకే-10) నుంచి 60 లక్షల టన్నులను వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలుగా ప్రతిపాదించినట్టు వివరించారు. అన్ని అనుమతులు సకాలంలో వచ్చాక ఉత్పత్తి ప్రారంభించాలని చెప్పారు. 2021-22లో సింగరేణి సంస్థ 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తుందన్నారు. 2022-23లో ఎంవీకే ఓసీ (వార్షిక లక్ష్యం 25 లక్షల టన్నులు), గోలేటి ఓసీ (35 లక్షల టన్నులు), జేకే ఓసీ (రోంపేడు, 25 లక్షల టన్నులు), తాడిచర్ల ఓసీ-2 (50 లక్షల టన్నులు), పెనగడప ఓసీ (15 లక్షల టన్నులు), న్యూ పాత్రపాద (ఒడిశా) గనుల ప్రతిపాదనలు, అనుమతులు పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించారు. 2023-24 నాటికి సింగరేణి సంస్థ 850 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించేలా లక్ష్యాలను పెట్టుకున్నట్టు తెలిపారు. సమావేశంలో సలహాదారులు డీఎన్ ప్రసాద్ (మైనింగ్), సురేంద్ర పాండే (ఫారెస్ట్రీ), ఈడీ (కోల్ మూమెంట్) జె ఆల్విన్, వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.