Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకృతివనం, వైకుంఠదామానికి పట్టా భూమి ఇచ్చిన గిరిజనులు
- మరోచోట స్థలం కేటాయింపు
- ఆ భూముల్లోనూ మొక్కలు నాటుతున్న అటవీ అధికారులు
నవతెలంగాణ-లింగంపేట్
అటవీశాఖ అధికారులు గిరిజనులపై జులుం ప్రదర్శించారు. రెవెన్యూ శాఖ అందజేసిన పట్ట భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు యత్నించారు. దీంతో గిరిజనులు అడ్డుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపల్లి మండలం ఒంటర్పల్లిలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
ఒంటర్పల్లి తండాలో వైకుంఠదామం, పల్లెపకృతి వనం ఏర్పాటు కోసం గ్రామంలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో తండాకు చెందిన కేతావత్ అభిరియా, నేనావత్ జగ్గురామ్ ముందుకొచ్చి తమ పట్టా భూముల్లో నుంచి 20 కుంటలు చొప్పున ప్రభుత్వానికి ఇచ్చారు. దీనికి బదులుగా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గ్రామ శివారులో సర్వే చేసి ఇద్దరికీ 20 గుంటల చొప్పున భూమిని కేటాయించారు. ఆ భూమిలో సాగుకు సిద్ధమవ్వగా.. సోమవారం అటవీశాఖ అధికారులు వచ్చి మొక్కలు నాటే ప్రయత్నం చేశారు. దీంతో అడ్డుకున్న గిరిజనులు.. తమకు రెవెన్యూ శాఖ కేటాయించిందని పత్రాలు సైతం చూపించారు. అయినా వినిపించుకొని అధికారులు గుంతలు తవ్వడం పట్ల గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్టు లతా రాందాస్ తెలిపారు.