Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుగుల మందు పట్టుకుని నామాపూర్ రైతుల ధర్నా
నవతెలంగాణ-పెగడపల్లి
కాళేశ్వరం లింక్-2 ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న తమకు మార్కెట్ ధర ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్ రైతులు డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ ప్రధాన రహదారిపై బైటాయించి పురుగుల మందుల డబ్బాలు పట్టుకుని ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు లింకు-2 పైప్ లైన్ భూ సేకరణలో భాగంగా గెజిట్ నోటిఫికేషన్లో కొంత మంది రైతుల వ్యవసాయ బావుల పేర్లు మాత్రమే ఇచ్చారన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మిగతా రైతులు నష్టపోతామని, రీసర్వే చేయించి మళ్లీ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతు బావుల కొలతలు వేయాలన్నారు. అలాగే, ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ భూములకు సవరించిన మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, కలెక్టర్ వచ్చి తమ సమస్యలను పరిష్కరించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ అశోక్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను ఆర్డీవో మాధురి దృష్టికి తీసుకెళ్లారు. జగిత్యాల ఆర్డీవో మాధురి, ఇరిగేషన్ శాఖ డీఈ నర్సింగరావు రైతుల వద్దకు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సుమారు నాలుగు గంటలకు పైగా రైతులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెద్ది సంతోష్, ఇనుగండ్ల సత్యనారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఇను గండ్ల మల్లారెడ్డి, రామ్రెడ్డి, నర్సింహారెడ్డి, రాజేశం, రాజిరెడ్డి, మల్లేశం, శ్రీనివాస్, భూనిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.