Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత రైతులకు ఏం చేశారో చెప్పండి...
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరదలు, వర్షాలకు పంటలు దెబ్బతిన్నప్పుడు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవటానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారీ వర్షాలకు నష్టం జరిగితే బాధిత రైతాంగానికి ఏం చేశారో చెప్పకుండా ఇంకేవో వివరాలు నివేదించడాన్ని తప్పు పట్టింది. తమ ముందున్న కేసులోని అంశాలపై నిర్దిష్టంగా చెప్పాల్సిందేనని నొక్కి చెప్పింది. వరదల అంశం కేంద్ర హౌం శాఖ పరిధిలోకి వస్తుందనీ, అవి విపత్తుల కిందికి వస్తాయంటూ కేంద్రం తన కౌంటర్లో పేర్కొనడంపై విస్మయాన్ని వ్యక్తం చేసింది. ప్రజాహిత వ్యాజ్యం విచారణకు వస్తుందనీ, ఈ నెల 3వ తేదీన్నే కాజ్ లిస్ట్ వెలువడిన తరుణంలో ఇప్పుడు విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది దాన్ని వాయిదా వేయాలంటూ ఎలా కోరతారని ప్రశ్నించింది. రైతుల సంక్షేమ విషయంపై పిల్ విచారణలో ప్రభుత్వాల తీరు ఎంతమాత్రం సమర్ధనీయంగా లేదని వ్యాఖ్యానించింది. గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో భారీ వర్షాలకు రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నా, వాటిని అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సికింద్రాబాద్కు చెందిన విస్సా కిరణ్కుమార్, ఇతరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్ రామచందర్రావు, న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.కేంద్రం దాఖలు చేసిన కౌంటర్లోని సమాచారాన్ని పరిశీలించిన న్యాయస్థానం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. వరదలతో తమకు సంబంధం లేదనీ, ఇది పూర్తిగా కేంద్ర హౌం శాఖకు చెందినదనీ, తమ శాఖది ఆఫ్షనల్ అని పేర్కొనటంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదీ కౌంటర్ కాపీనా అని పేర్కొంటూ, నోడల్ ఏజెన్సీ అని చెప్పడాన్ని తప్పుపట్టింది. భారీ వర్షాలకు పంటలు దెబ్బతింటే తమకు సంబంధం లేదని చెప్పడం సరికాదని చెప్పింది. ఈ దశలో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్రావు కల్పించుకుని, కొంత గడువు కావాలనీ, తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలు సమర్పిస్తామని చెప్పారు. గతేడాది అక్టోబర్, నవంబర్లో భారీ వర్షాలకు పంటల నష్టం గురించి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకూ తేల్చకపోవడం సరి కాదని కోర్టు అభిప్రాయపడింది. 2020 అక్టోబర్, నవంబర్ నెలల్లో భారీ వర్షాలకు 12 లక్షల ఎకరాల్లో పంటలు నాశనం అయ్యాయనీ, 8,600 కోట్లకుపైగా పంటలు దెబ్బతిన్నాయని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ప్రభుత్వ న్యాయవాది రాజీవ్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏజీ విచారణకు రావాల్సివుందనీ, వేరే కోర్టులో ఉన్నందున రాలేకపోయారనీ, విచారణను వాయిదా వేయాలని కోరారు. శుక్రవారమే కేసుల విచారణ జాబితా వెలువడిందనీ, వాయిదా కోరడం సరికాదనీ, ఇది రైతుల సంక్షేమంతో ముడిపడిన విషయమనే అంశాన్ని మరిచిపోవద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 8న జరిగే విచారణను వాయిదా వేయబోమని స్పష్టం చేసింది.రాష్ట్రంలోని రైతులకు పట్టాదార్ పుస్తకాలు ఉంటే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నామనీ, రెండు పంటలకు ఆ పథకం కింద రైతులకు ఆర్థిక చేయూత ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే, కౌలు రైతులు 15 లక్షల మందికి ఈ పథకాలనుఇవ్వలేకపోతున్నామని చెప్పింది. కేంద్ర వ్యవసాయ శాఖ దాఖలు చేసిన కౌంటర్లో పీఎం ఫసల్ బీమా యోజన కింద పంటలకు బీమా పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్నదనీ, గతేడాది పంటలను రాష్ట్రం నోటిఫై చేయకపోవడంతో ఆ పథకాన్ని రాష్ట్రంలోని రైతులకు అమలు చేయలేకపోయినట్టు తెలిపింది. భారీ వర్షాలు, వరదల విషయం కేంద్ర హౌం శాఖ విపత్తులుగా పరిగణిస్తుందని తెలిపింది. కరువు, వడగండ్ల వాన వల్ల పంటలు దెబ్బతింటే అప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ చట్ట ప్రకారం ఆదుకుంటుందని వివరించింది.