Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కజొన్న చేనుకు వెళ్లి చిక్కుకున్న ఆదీవాసీ గిరిజనులు
నవతెలంగాణ-గూడూరు
చుట్టూ వాగులు.. వంకలు.. అటవీ ప్రాంతం. అక్కడ గిరిజనులంతా పోడు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం వాగులు దాటుకుంటూ వెళ్లారు.. సాయంత్రం భారీ వర్షం పడటంతో రెండు వాగుల మధ్యలో చిక్కుకున్న వారు ధైర్యం.. సాహసంతో తాడు సహాయంతో వాగు దాటారు. ఇదీ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టెవాడ గ్రామపంచాయతీ పరిధి దొరవారి తిమ్మాపురం ఆదివాసీ గిరిజనుల పరిస్థితి. సోమవారం ఉదయం వ్యవసాయ పనుల కోసం మొక్కజొన్న చేను వద్దకు ఉదయం వెళ్లారు. ఆ తర్వాత భారీ వర్షం పడటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆదివాసీ గిరిజనులు రెండు వాగుల మధ్య చెలకల వద్ద చిక్కుకున్నారు. సాయంత్రం వరకు కూడా వర్షం తగ్గకపోవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో.. ధైర్యం చేసిన ఆదివాసీ గిరిజనులు తాడు సహాయంతో 13 మంది ఒకరికి ఒకరు సహకరించుకుంటూ వాగు దాటి ఒడ్డుకు చేరుకున్నారు. వీరిలో మహిళలూ ఉన్నారు. ఉరకలేస్తున్న వాగు ప్రవాహంలో ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని వచ్చామని పెనుక శ్రీకాంత్, పిడబోయిన వెంకన్న, పిడబోయిన నరసింహారావు, పెనుక మహేందర్, పెనుక సుమలత, పెనుక లక్ష్మి, పిడబోయిన రవి, పిడబోయిన భద్రయ్య, పూనం సూరయ్య దనసరి రవికుమార్, మద్దెల భాస్కర్, మద్దెల ప్రవీణ్ చెప్పారు. పునెం జంపయ్య- రమ దంపతులు వాగు అవతల మొక్కజొన్న చేను వద్దనే ఉండిపోయారు. ఆగస్టు 16న కూడా పిడబోయిన విజరు కుమార్-సుభద్ర భారీ వర్షంతో వాగు అవతలివైపు చిక్కుకుపోగా తాడు సహాయంతో దాటారు. వర్షాకాలం వచ్చిందంటే సమస్య తీవ్రంగా ఉంటోందని బాధితులు వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించాలని, గ్రామానికి రోడ్డు మంజూరు చేసి వాగులపై బ్రిడ్జిలు నిర్మించాలని ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు. గూడూరు తాసిల్దార్ శైలజ దొరవారు తిమ్మాపూర్ గిరిజనులతో ఫోన్లో మాట్లాడారు. ఎవరూ వరదలో వాగులు దాటే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు.