Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలేవి?
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చెరుపల్లి, డిజి
- ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండని పిలుపు
- రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు
నవతెలంగాణ-మొఫసిల్ యంత్రాంగం
''బీజేపీ అధికారంలోకొస్తే ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రధాని మోడీ గొప్పలు చెప్పారు. ఏడేండ్లల్లో ఉద్యోగాలివ్వకపోగా ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు.. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు.. ప్రభుత్వ రంగాలను అమ్మకాని పెట్టడం అభివృద్ధి నిరోధకం'' అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహారావు అన్నారు. కరోనా, లాక్డౌన్ సమయంలో 14కోట్ల మంది ఉపాధికి దూరమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం) దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం రాష్ట్రంలోనో నిరసన, ధర్నాలు చేశారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న ప్రధానికి దేశాన్ని పాలించే హక్కు లేదంటూ నినదించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలకు అమ్మకానికి పెట్టిందన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసేవిధంగా దొడ్డి దారిన తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ, సౌత్ సిటీ కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డిజి నర్సింహారావు ప్రసంగించారు. బీజేపీ పాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచారని, గ్యాస్ సబ్సిడీని సైతం ఎత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, రహదారులను ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తున్నారని చెప్పారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో పెట్రోలు ధరలు రూ.30-40 మాత్రమే ఉన్నాయని, మన దేశంలో కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో ధరలు పెంచుతున్నాయని తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ సెక్టార్లలో వాటాలను అమ్మకానికి పెట్టి రూ.6 లక్షల కోట్లను సమీకరించాలన్న లక్ష్యం అభివృద్ధి నిరోధకమని వివరించారు.నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు చేపట్టారు. నిజామాబాద్లో పార్టీ జిల్లా కార్యదర్శి రమేశ్బాబు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట నిరనస తెలిపి.. అదనపు కలెక్టర్కు వినతిపత్రం అంజదేశారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చేర్యాల, పుల్కల్, జోగిపేట, పెద్దశంకరంపేట మండలాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవి కుమార్ ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను మరిచి, విదేశీ, సామ్రాజ్యవాదులకు అనుకూలంగా పాలిస్తోందని విమర్శించారు. మంచిర్యాల కలెక్టరేట్ ధర్నా చేపట్టారు.
జన్నారం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడ్లో తాళ్లతో ఆటోను లాగి నిరసన తెలిపారు.హన్మకొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వరంగల్ కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నర్సంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ శశాంక్కు వినతి పత్రాన్ని అందజేశారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి శ్యామ్ కుమర్కు వినతిపత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.