Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతన బకాయిలు విడుదల చేయాలి
- జోరు వానను లెక్క చేయక... హక్కుల సాధన కోసం
- ఈఎన్సీ ఆఫీస్ ముట్టడించిన మిషన్భగీరథ కార్మికులు
- సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తాం : జూలకంటి సీఎంకు లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మిషన్ భగీరథ స్కీంలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. పీఆర్సీ అమలు చేయాలనీ, 6,7 నెలల బకాయి వేతనాలను చెల్లించాలని కోరింది. సోమవారం హైదరాబాద్ఎర్రమంజిల్లోని మిషన్భగీరథ ఇంజనీరింగ్ ఇన్చీఫ్ (ఈఎన్సీ) కార్యాలయాన్ని యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ముట్టడించారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా హక్కుల సాధన కోసం కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రెండుగంటలపాటు అధికారులను లోపలికి, బయటకు వెళ్లనీయకుండా కార్మికులు ముట్టడిని కొనసాగించారు.అనంతరం మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీరు (సీఈ) విజయప్రకాశ్కు వినతిపత్రం సమర్పించారు. 'వారం రోజుల్లో బకాయి వేతనాలు అందజేస్తాం. కనీస వేతనాలు, పీఆర్సీ, ఇతర పెండింగ్ సమస్యలన్నింటికీ కంపెనీల యజమానులు, మిషన్ భగీరథ అధికారులు, కార్మిక నాయకులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం' అని ఆయన హామీ ఇచ్చారు. అంతకు ముందు కార్మికులనుద్దేశించి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ స్కీమ్ సుమారు రూ 45వేల కోట్ల వ్యయంతో అట్టహాసంగా ప్రారంభించిందన్నారు. దీంతో 25వేల గ్రామాల్లో ప్రతి ఇంటికి పరిశుభ్రమైన మంచినీటిని అందించడంలో 15వేల మంది మిషన్భగీరథ కార్మికులు, పంప్ ఆపరేటర్లు, లైన్మెన్లు, పిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. ఇంత చాకిరీ చేస్తున్నా వారికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పీఎఫ్, ఈఎస్ఐ, వారాంతపు సెలవులు, 8 గంటల పని విధానాన్ని అమలు చేయకుండా కార్మికులతో వెట్టిచాకిరి చేయించడం దుర్మార్గమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చి వేతనాలు పెంచిన సర్కారు...వీరికి వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ కంపెనీలకు ఒక్కొక్క కార్మికుని కోసం నెలకు రూ 18వేలు ఇస్తుంటే కంపెనీలు మాత్రం కార్మికులకు రూ 8వేలు, రూ 9వేలు మాత్రమే ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా కార్మికులను బడా కంపెనీలైన మెగా, రాఘవ, ఎల్ అండ్ టీ, ఎవరెస్టు, ఎన్సీసీ, జీవీఆర్, ఐహెచ్పీ తదితర కంపెనీలు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. కార్మికులకిచ్చే అతి తక్కువ వేతనం రూ 9వేలను కూడా ఇవ్వడం లేదన్నారు. కంపెనీల నుంచి కార్మికులకు కనీస వేతనాలు, పీఆర్సీ, బకాయి వేతనాలు, చట్టబద్ధ హక్కులు, వారాంతపు సెలవులు, పని గంటలు అమలు చేయించాల్సిన ప్రభుత్వం దున్నపోతుపై వాన కురిసిన చందంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం రూ 21వేలు ఇవ్వాలనీ, పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రగతిభవన్ను ముట్టడి చేస్తామని హెచ్చరించారు.అనంతరం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు.
ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు మాట్లాడుతూ అధికారులు హామీ ఇచ్చిన విధంగా వారం రోజుల్లో జాయింట్ మీటింగ్ పెట్టి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయకుంటే మరోసారి చలో హైదరాబాద్ ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ధర్నాకు రాష్ట్ర అధ్యక్షులు జెంజిరాల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కూరపాటి రమేష్, కోశాధికారి సుధాకర్, ఉపాధ్యక్షులు వెంకటయ్య, కార్యదర్శి రాంబాబు, సైదులు,సీహెచ్ రాములు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.