Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముసురేసిన రాష్ట్రం
- పొంగుతున్న వాగులు.. బ్రిడ్జీలపై నుంచి ప్రవహిస్తున్న వరద
- గ్రామాలకు రాకపోకలు బంద్.. పొలాల్లో నిలిచిన వరద
- సింగరేణిలో స్తంభించిన బొగ్గు ఉత్పత్తి, రవాణ
- భద్రాద్రి వరదలో కొట్టుకుపోయి చిన్నారి మృతి
- హైదరాబాద్కు భారీ వర్ష సూచన
- ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరిక
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
రాష్ట్ర వ్యాప్తంగా వర్షం మురుసుకుంది.. ఓ మోస్తరు నుంచి భారీ వర్షం విడువకుండా కురుస్తోంది. వాగులు ఉగ్రరూపం దాల్చి వరద రోడ్లు, బ్రిడ్జీల పైనుంచి ప్రవహిస్తోంది. రాకపోకలను బంద్ చేసిన అధికారులు భౄరీకేడ్లు పెట్టారు. చెరువులు అలుగులు పారడం వల్ల ఆయకట్టు పొలాలన్నీ వరదలో చిక్కుకున్నాయి. ఇలాగే పరిస్థితి ఉంటే పైర్లు మురిగిపోయే ప్రమాదం ఉంది. చాలా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సోమవారం రాత్రికి భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ ప్రకటించారు.
ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు,వంకలు,చెరువులు పొంగిపొర్లుతున్నాయి. చప్టాలపై నీరు ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.పత్తి,మిరప, వరి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగాయి. సింగరేణిలో బొగ్గు రవాణా స్తంభించింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ- మునగాల గ్రామాల మధ్య వాగు పొంగుతుండటంతో రాకపోకలు నిలిచాయి. సత్తుపల్లి మండలం చెరుకుపల్లి వద్ద వాగు వల్ల పలు గ్రామాలకు రాకపోకలు బంద్ చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద నీరు నిలువడంతో రెండు బస్సులు అక్కడే నిలిచిపోయాయి. రాకపోకలను నిలిపివేస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇల్లందు మండలంలోని బుగ్గవాగు ఉగ్రరూపం దాల్చింది.
అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం వాగు, వెంకటాపురం వద్ద రాళ్లవాగు వంతెనపై నుంచి నీళ్లు ప్రవహిస్తుండటంతో తహసీల్దార్ భద్రాకళ రాకపోకలను నిలిపివేశారు. పెంట్లం గ్రామంలో ఇండ్లల్లో నీరు చేరింది. చుంచుపల్లి మండలం రామ్నగర్ కాలనీలో బొంకూరి శంకర్ ఇల్లు కూలింది. టేకులపల్లి మండలం తడికలపూడిలో రైల్వే లైన్ పూర్తిగా నీటమునిగింది. కోయగూడెం ఓపెన్ కాస్ట్ నుంచి తడికలపూడి రైల్వే స్టేషన్కు వెళ్లే వందలాది బొగ్గు లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. పరికలవాగు, తెల్లవాగు చెరువు, గడ్డిచెరువు, రోళ్లపాడు చెరువుతోపాటు తదితర వాగులు పొర్లుతున్నాయి. మణుగూరు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు పూర్తి ఆటంకం ఏర్పడింది. అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టు నిండటంతో రెండు గేట్లను ఎత్తి దిగువకు విడదల చేస్తున్నారు. పాల్వంచ పట్టణంలోని శ్రీనివాస్నగర్ గుట్టలపై నుంచి పాములు వనమా కాలనీ, జయమ్మ కాలనీ, వికలాంగుల కాలనీలోకి కొట్టుకొస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
వరద నీటిలో కొట్టుకుపోయిన చిన్నారి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని వికలాంగుల కాలానికి చెందిన శనగ అంజలి వరద నీటిలో కొట్టుకపోయి చనిపోయింది. శనగ రవి-నాగమణి దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి తేజ,రెండో అబ్బాయి మణికంఠ, మూడో అమ్మాయి అంజలి(7). తల్లిదండ్రులు కూలిపని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉదయం భారీ వర్షానికి మణికంఠ, అంజలి వరద నీటిలో కొట్టుకుపోతుంటే స్థానికులు మణికంఠను కాపాడారు. చేపలు పట్టే వల వేసి వెతకగా..అంజలి మృతదేహం లభ్యమైంది. పాల్వంచ తహశీల్దార్ స్వామి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నిండుకుండలా పార్వతీ బ్యారేజీ
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సిరిపురం వద్ద పార్వతి బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది.లక్ష క్యూసెక్కులకుపైగా నీరు బ్యారేజీలోకి చేరుతోంది.వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగువకు వదులుతున్నారు. 74గేట్లకుగాను ఆగస్టు 26వ తేదీ నుంచి నిరంతరాయంగా గేట్లను విడతల వారీగా..60గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నా రు.లక్ష్మి బ్యారేజీ, అన్నారం బ్యారేజీల నుంచి కూడా నీటిని విడుదల చేయడం వల్ల పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచించారు. కరీంనగర్లో నిరహదారులపైకి మురుగు నీరు చేరి చెరువును తలపించాయి. శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో సెయింట్ జాన్స్ పాఠశాల ఎదురుగా ఉన్న ఇండ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలను కరీంనగర్ నగర పాలక మేయర్ సునీల్ రావు.. కమిషనర్ అగర్వాల్తో కలిసి పరిశీలించారు.
బాల్కొండలో రాళ్ల వాన
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో రాళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి మోస్తారుగా పడ్డ వర్షం.. సాయంత్రం వేళ ఒక్కసారిగా పెరిగింది. భారీ వర్షంతో పాటు రాళ్లు పడ్డాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో రాంపూర్లో లెవల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో పిట్లం-బాన్సువాడకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. నాగర్కర్నూల్ జిల్లా మల్కాపూర్, పుల్జాల, తాళ్లపల్లి, నడిగడ్డ, దాసర్లపల్లి, గుట్టలపల్లి గ్రామాలను వరద చుట్టుముట్టింది. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి, ముక్కిడిగుం డం, నార్లాపూర్ పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి మంచినీటి పైప్లైన్ పగిలిపోయింది. నారాయణపేట జిల్లాలో కృష్ణ మండలం తంగెడులో దాదాపు 250ఎకరాల పైరు నీట మునిగింది. హన్మకొండలో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారి పై డీజిల్ కాలనీ సమీపంలో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. నిట్ వరంగల్ ప్రధాన రహదారి నుంచి సుబేదారి వరకు ప్రధాన రహదారిపై నీరు నిలిచింది. హన్మకొండ కొత్త బస్టాండ్, వరంగల్ మున్సిపల్ కార్యాలయం వరదనీటితో నిండాయి. వరంగల్ జిల్లా నర్సంపేట జాతీయ రహదారి పక్కన ఇండ్లలోకి నీరు చేరింది. సంగెం మండలంలోని మొండ్రాయిలో ద్విచక్రవా హనం,స్కూటీ వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. వాటిపై ఉన్న వారిని స్థానికులు కాపాడారు. పల్లారుగూడ నుంచి మొండ్రాయికి వెళ్లే దారిలో కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహించింది. భూపాలపల్లి జిల్లా అన్నారం వయా కాళేశ్వరం మార్గ మధ్యలో చండ్రుపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. పెద్ద చెరువు 4అడుగుల ఎత్తులో మత్తడి పోస్తోంది. చింతోని గుంపు,పెద్ద గుట్ట, ఏడు బావుల జలపాతాల వద్దకు సందర్శకులు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మహబూబాబాద్ నుంచి భద్రాచలం వెళ్లే జాతీయ ప్రధాన రహదారి నామాలపాడు జిన్నాల వాగుపై డౌన్ వంతెన వద్ద రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. కొత్తగూడ మండలం కార్లయి గ్రామంలోని పాత చెరువు చెక్ డ్యాంకు గండి పడింది.
విద్యార్థులను రక్షించిన స్థానికులు
హన్మకొండ జిల్లా దామెర మండలం పసరగొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంటికి వస్తున్న క్రమంలో భారీ వర్షం కురిసింది. లోలెవల్ వంతెన పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. దాటే క్రమంలో ముగ్గురు విద్యార్థులు కొట్టుకుపోయారు. పక్కనే ఉన్న పొదల్లో చిక్కుకుని కేకలు వేయడంతో.. స్థానికులు తాళ్ల సాయంతో రక్షించారు.
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి 51 గేట్లు ఎత్తివేత
జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ 85 గేట్లకుగాను 51 గేట్లు ఎత్తి 3లక్షల 77వేల500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు ఈఈ తిరుపతిరావు తెలిపారు. అన్నారం సరస్వతి బ్యారేజీ 65 గేట్లకుగాను 52 గేట్లు ఎత్తి 2 లక్షల34వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు ఈఈ యాదగిరి తెలిపారు. దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంజినీర్లు సూచించారు.
నగరంలో ముసురు
గ్రేటర్ హైదరాబాద్లో వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రికి భారీ వర్ష సూచన ఉండటంతో ఎవరూ బయటకు రావొద్దని.. బయట ఉన్న వారూ కూడా త్వరగా ఇండ్లకు చేరుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనా, ఇతర సమాచారం కోసం 040-29555500 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో మళ్లీ కుండపోత వర్షం కురిసింది. నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో అధికారులు పర్యటిస్తూ తొలగిస్తూ.. సహాయ చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షం వల్ల రోడ్లు, కాలనీల్లో జనం రాకపోకలకు, రోజువారి కార్యలకలాపాలకు ఆటంకం కలుగుతోంది. జీహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్లు రంగంలోకి దిగి ఎప్పటికప్పుడూ నీరు నిలువకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.