Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.భాస్కర్
- ఆషా వర్కర్స్ యూనియన్ ధర్నా
- కలెక్టర్కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు పెంచిన వేతనాలు ఇవ్వకుండా.. ఆశ పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.భాస్కర్ అన్నారు. తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ వర్కర్స్(ఆశ) యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశాలకు ప్రభుత్వం పెంచిన 30శాతం పీఆర్సీని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సంబంధిత జిఓలను తక్షణమే విడుదల చేయాలన్నారు. జూన్ 15వ తేదీన రాష్ట్ర ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఆశాలకు సంబంధించిన పీఆర్సీ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న పారితోషికాలకు 30శాతం పారితోషికాలు పెంచుతున్నామని సర్క్యులర్లో తెలియజేశారన్నారు. సర్క్యులర్ వచ్చి రెండున్నర నెలలు దాటిందన్నారు. అయినా హెల్త్ డిపార్టుమెంట్ ఆశాలకు సంబంధించిన 30శాతం పీఆర్పీ జీవోను నేటికీ విడుదల చేయలేదన్నారు. ఆశాలతో పాటు పీఆర్సీ ప్రకటించిన అంగన్వాడీ ఉద్యోగులకు ఆగస్టు 18న జీవోను ఐసీడీఏ డిపార్టుమెంట్ విడుదల చేసిందన్నారు. తోటి రంగాల కార్మికులకు పీఆర్సీ ఉత్తర్వులు విడుదలైనప్పుడు తమకేందుకు విడుదల చేయడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు ఆందోళన చెందుతున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. ఈ తరుణంలో పెంచిన పీఆర్సీ డబ్బులు రాకపోవడంతో ఆశాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. నిరంతరం ఆన్లైన్ సర్వేలు చేయిస్తున్న ప్రభుత్వం స్మార్ట్ ఫోన్స్ మాత్రం ఇవ్వడం లేదన్నారు. రోజువారి అవసరమైన రిజిస్టర్లను కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశాలెదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జి.ఓ నెం 60 ప్రకారం అన్స్కిల్డ్ కార్మికులకు చెల్లించే రూ.15,600/- చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ లోపు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టు ఫిక్స్డ్ వేతనం రూ.10,000/- ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కవిత, జిల్లా కార్యదర్శి రాధిక, కోశాధికారి లలిత, ఆశా కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.