Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం
- రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రూ.3,284 కోట్లు
- రెండేండ్ల నుంచి విడుదల చేయకుండా సర్కారు నిర్లక్ష్యం
- సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న యాజమాన్యాలు
- ఉన్నత చదువులకు వెళ్లలేక ఆందోళన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు సుమారు రూ.3,284 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయట్లేదు. అటు కాలేజీలకు ట్యూషన్ ఫీజులు, ఇటు విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం గమనార్హం. దీంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. అయినా విద్యార్థుల గోస పాలకులకు పట్టడం లేదు. ఫీజు రాకపోవడం వల్ల పలు కోర్సుల్లో విద్యార్థులు ఉత్తీర్ణులైనా కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని తేల్చిచెప్తున్నాయి. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ విడుదల చేస్తే తిరిగి చెల్లిస్తామని వాపోతున్నాయి. ఆ డబ్బును కట్టే స్థోమత లేక, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ, పేద పిల్లలు ఉన్నత చదువులకు వెళ్లలేక ఆందోళన చెందుతున్నారు. ఇక కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకూ వేధింపులు తప్పడం లేదు. ఫీజు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామనీ, హాల్టికెట్లు ఇస్తామని కాలేజీల యాజమాన్యాలు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్పైనే ఆధారపడిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక మానసికంగా వేదనకు గురవుతున్నారు. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వనపర్తి జిల్లా గోపాల్పేటకు చెందిన ఓ విద్యార్థిని ఫీజులు రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించింది. విద్యాసంవత్సరంలో త్రైమాసికం (మూడు నెలలకోసారి) వారీగా ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేస్తామని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కానీ వాటిని తుంగలో తొక్కింది. రెండేండ్లుగా పెండింగ్లో ఉన్నా వాటిని విడుదల చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది.
ఏటా 13.50 లక్షల మంది దరఖాస్తు
ఏటా ఇంజినీరింగ్ సహా వృత్తివిద్యా కోర్సులతోపాటు మెడిసిన్, డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియెట్ కలిపి సుమారు 5.50 లక్షల మంది కొత్తగా, మరో 8 లక్షల మంది రెన్యూవల్ కోసం కలిపి మొత్తం 13.50 లక్షల మంది ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను పెండింగ్లో ఉంచడంతో విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. కరోనా నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు ఉపాధినీ, ఉద్యోగాలను కోల్పోయారు. ఫీజును కట్టే పరిస్థితి లేదు. ఇది ప్రభుత్వానికి తెలిసినా బకాయిలను విడుదల చేసేందుకు మొగ్గుచూపడం లేదు. కొన్ని సార్లు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా కాలేజీలు, విద్యార్థుల అకౌంట్లకు చేరడం లేదు. ఎందుకంటే ఆర్థిక శాఖ ఆ నిధులను ఫ్రీజింగ్లో ఉంచుతున్నది. దీంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. 2019-20 విద్యాసంవత్సరంలో రూ.784 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. 2020-21 విద్యాసంవత్సరానికి రూ.2,500 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. రెండు విద్యాసంవత్సరాలకు కలిపి రూ.3,284 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. గత విద్యాసంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో రూ.2,250 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి విడుదల చేయకపోవడం గమనార్హం. ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసే ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగులకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల్లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల్లోపు ఉండాలి. అలా ఉంటేనే దరఖాస్తు చేసేందుకు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఫీజు బకాయిలను విడుదల చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. యాజమాన్యాలు వేధించకుండా కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలనీ, ప్రస్తుతం చదువుతున్న వారిని పరీక్షలకు అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
ఫీజుల్ని విడుదల చేయకపోవడం వల్ల పాసైన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దళితబంధుకు రూ.2 వేల కోట్లు విడుదల చేశారు. అదే తరహాలో విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
- టి నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి
విద్యార్థులను ఆదుకోవాలి
రెండేండ్లుగా ఫీజులు రాక అటు విద్యార్థులు, ఇటు కాలేజీ యజమానులు నరక యాతన అనుభవిస్తున్నారు. కాలేజీ భవనాల అద్దె, సిబ్బందికి జీతాలు చెల్లించలేక, ఈఎంఐలు, అప్పు కట్టలేక ఇబ్బందికి గురవుతున్నారు. ఇంకోవైపు ప్రభుత్వానికి చెల్లించే అనుబంధ గుర్తింపు ఫీజు, తనిఖీ ఫీజు, ప్రాపర్టీ ట్యాక్స్, కరెంటు, నీటి బిల్లులు సకాలంలో చెల్లించాల్సి వస్తున్నది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఫీజు కట్టే పరిస్థితి లేదు. వారి భవిష్యత్తు దృష్ట్యా త్వరితగతిన ఫీజును విడుదల చేయాలి.
- గౌరి సతీష్, టీపీజేఎంఏ అధ్యక్షులు