Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటి వాటాల లెక్క తేల్చండి:
- కేంద్రమంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలోని జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం కోసం నిధులు, అనుమతులు మంజూరు చేయాలనీ, రాష్ట్రానికి గోదావరి బేసిన్ నుంచి రావల్సిన నీటి వాటా లెక్కల్ని తేల్చాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్రమంత్రులను కోరారు. ఢిల్లీలో సోమవారంనాడాయన కేంద్ర ఉపరితర రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నితిన్ గడ్కరీకి ఐదు అంశాలతో కూడిన వినతిపత్రాలను వేర్వేరుగా అందచేశారు. హైదరాబాద్ (ఓఆర్ఆర్) నుంచి కల్వకుర్తి సెక్షన్ జాతీయ రహదారి 765 ప్రస్తుతం రెండులైన్ల రోడ్డుతో ఉన్నదనీ, దాన్ని నాలుగులైన్ల రోడ్డుగా విస్తరించాలని కోరారు. దీనికి పరిపాలనా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) నుంచి 2021లో రూ.744 కోట్ల ప్రతిపాదనలు పంపించిందనీ, దానిలో కేవలం దాదాపు రూ.250 కోట్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కేటాయింపులు వచ్చే రెండేండ్లలో పెంచాలని కోరారు. హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి ప్రస్తుతం నాలుగులైన్లతో ఉన్నదనీ, దాన్ని ఆరులైన్లకు విస్తరించాలని కోరారు. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2018లో ప్రతిపాదించిన 340 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణంలో ఉత్తర భాగంలోని సంగారెడ్డి-గజ్వేల్- చౌటుప్పల్ సెక్షన్, 158 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవేకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దక్షిణ భాగంలోని చౌటుప్పల్-షాద్నగర్-సంగారెడ్డి సెక్షన్, 182 కి.మీ., కు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించామన్నారు. దానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం వల్ల మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందని వివరించారు. అలాగే 158 కి.మీ., సెక్షన్లో గజ్వేల్ రింగ్ రోడ్డు, బస్వాపూర్ రిజర్వాయర్ సహా పలు నిర్మాణాలు చేపట్టామనీ, కొన్ని చోట్ల అలైన్మెంట్లలో మార్పులు చేశామన్నారు. వాటిని ఆమోదించాలని కోరారు. తెలంగాణలో 2,168 కి.మీ., రాష్ట్ర రహదారులను నేషనల్ హైవేగా గుర్తించారనీ, రాష్ట్ర అవతరణ తర్వాత దీన్ని 3,306 కి.మీ.,గా అప్గ్రేడ్ చేసినట్టు వివరించారు. మిగిలిన 1,138 కి.మీ., రాష్ట్ర రహదారుల్లో ప్రధానమైన నాలుగు రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చౌటుప్పల్-ఆమన్గల్-షాద్నగర్-కంది (ఆర్ఆర్ఆర్లో భాగం) 182 కి.మీ., కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లాం 165 కి.మీ., కొత్తకోట- గూడూరు మీదుగా మంత్రాలయం 70 కి.మీ., జహీరాబాద్-బీదర్-దెగ్లూర్ 25 కి.మీ., మొత్తంగా 442 కి.మీ., రోడ్లను నోటిఫై చేయాలని కోరారు.
మా ప్రాజెక్టులన్నీ పాతవే...
గోదావరి బేసిన్లో తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ పాతవేనని కేసీఆర్.. కేంద్ర జలశక్తి మంత్రి జీఎస్ షెకావత్కు వివరించారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో ఆయన్ని కలిసి రాష్ట్ర ప్రాజెక్టుల వివరాలను అందచేశారు. రాష్ట్ర వాటా నీటి వినియోగానికి సంబంధించి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (జీఆర్ఎమ్బీ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం, తుపాకులగూడెం, రామప్పపాకాల లింక్, దేవాదుల, కాంతనపల్లి, చౌటుపల్లి హన్మంతురెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ సహా పలు ప్రాజెక్టుల నీటి కేటాయింపులు, నిర్మాణ వివరాలను కేంద్రమంత్రికి అందచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్కుమార్, ఈఎన్సీలు మురళీధరరావు, హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు, దేశ్పాండే, ఎస్ఈ కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.