Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అధిక వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి, నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని తెలంగాణ రైతుసంఘం మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎకరా పంట నష్టానికి రూ.25వేలు ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ కోరారు. వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే మూడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతాంగం పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. ఇప్పటికే జరిగిన పంట నష్టంతో రైతులు ఆందోళనగా ఉన్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు సమాచార సేకరణకు ఎందుకు కదలటం లేదని ప్రశ్నించారు. పంట నష్టాన్ని తక్షణం అంచనా వేసి కేంద్రానికి ఆర్థిక సహాకారం కోసం నివేదించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడేండ్ల కాలంలో రెండు సార్లు మాత్రమే కేంద్ర బృందాలు పర్యటించాయని గుర్తుచేశారు. 14,15వ ఫైనాన్స్ కమిషన్లు తెలంగాణకు ప్రకృతి వైపరిత్యాల కింద చేస్తున్న సహాయాన్ని వినియోగించడం లేదని ఆరోపించారు. ప్రతి రైతును ఆదుకుంటామన్న ప్రకటన కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. రైతు సంఘ నాయకులు నష్టం జరిగిన ఆయా ప్రాంతాలను పర్యటించి ఆధికారులకు వివరాలతో కూడిన వినతి పత్రాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.