Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రావి నారాయణరెడ్డి వర్ధంతి సభలో సురవరం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫాసిస్టు, మతతత్వ విధానాలు అనుసరిస్తున్న మోడీ సర్కారు బారినుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో మంగళవారం తెలంగాణ సాయుధ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి 30వ వర్ధంతి సభ జరిగింది. ఆయన చిత్రపటానికి సురవరం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం వ్యతిరేక పోరాటంలో రావి నారాయణరెడ్డి పోరాటాలకు లక్షలాది మంది ఉత్తేజితులయ్యారని గుర్తు చేశారు. లోతైన ఆలోచనతో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పారు. మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. వాటిని కాపాడుకోవాలని అన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలుపొందిన రావి నారాయణరెడ్డితో పార్లమెంటు భవనాన్ని ప్రారంభింపచేశారని చెప్పారు. అలాంటి చరిత్ర ఉండొద్దనే కారణంతోనే మోడీ కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారని అన్నారు. ఎర్రజెండాలు ఒక్కటి కావాల్సిందేననీ, ఏదో ఒక రోజు అది తప్పక జరుగుతుందని వివరించారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాసంగికత పెరుగుతున్నదని చెప్పారు. దేశంలో కమ్యూనిస్టులు విడివిడిగా ప్రయాణం చేస్తే ఉనికి లేకుండా పోతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, ప్రజాపక్షం సంపాదకులు కె శ్రీనివాస్రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు ఉజ్జిని రత్నాకర్రావు, పీఎన్ఎం ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా తదితరులు పాల్గొన్నారు.