Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ - ఎంఈఏఐ హైదరాబాద్ ఛాప్టర్కు యాక్టివ్ ఛాప్టర్ పురస్కారాన్ని ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్లో మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఛాప్టర్ (ఎంఈఏఐ), అలుమ్ని ఆఫ్ మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ (ఓయూ, కేయూ, ఏఎంఈఏ) ఆధ్వర్యంలో సంయుక్తంగా ఇండిస్టీ అకాడమియా ఇంటరాక్షన్ ఇన్ మైనింగ్ ఇండిస్టీ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించాయి. ఈ సందర్భంగా యాక్టివ్ చాప్టర్ అవార్డును అసోసియేషన్ మాజీ చైర్మెన్ సుశీల్ కుమార్, ప్రస్తుత చైర్మెన్ సుమిత్ దేబ్కు అందజేశారు. మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ జాతీయ చైర్మెన్గా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన పూర్వ అధ్యక్షుడు సంజరు పట్నాయక్ను హైదరాబాద్ ఛాప్టర్ తరఫున సన్మానించారు. మైనింగ్ విద్యను అభ్యసించే విద్యార్థులు, ఇంజినీర్లకు ఉపయుక్తంగా ఉండటానికి వీలుగా మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. దీనిపై పూర్తిగా అధ్యయనం చేయడానికి విషయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఫస్టు ఎయిడ్ సెంటర్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై 15 రోజుల్లో కమిటీ తన నివేదికను ఇవ్వాలని సూచించారు. సమవేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఓయూ వీసీ డాక్టర్ రవీందర్ అసోసియేషన్ సేవలను ప్రశంసించారు. ఉస్మానియాలో మైనింగ్ యూజీ కోర్సు ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని డాక్టర్ రవీందర్ ప్రకటించారు.