Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రవాణా రంగం కుదేలైందని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ వర్క్షాప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. యాదగిరి రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆర్. లక్ష్మయ్య మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల వల్ల రవాణారంగ కార్మికులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందన్నారు. కరోనా కాలంలో రవాణారంగ కార్మికులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు వేధింపులు ఆపాలని కోరారు. ఈఎమ్ఐలు కట్టలేక అనేకమంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి కార్మికవర్గం దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరించి వేసిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను విధ్వంసం చేసిందన్నారు. పారిశ్రామిక వ్యవసాయ సేవా, రవాణా రంగాలను దెబ్బతీసిందన్నారు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడంతో పాటు, పేదలకు పౌష్టికాహారం అందించడంలో పూర్తిగా బిజెపి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సాయిబాబు మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 27న జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలనీ, ఆ బంద్లో రవాణారంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. రవాణారంగ కార్మికులకు, పేదలందరికీ ఆరు నెలల పాటు 7,500 రూపాయలు ఇవ్వాలనీ, 10 కేజీల బియ్యం రేషన్ కార్డు లేకుండా అందరికీ పంపిణీ చేయాలనీ, 16 రకాల నిత్యావసర సరుకులు పేద ప్రజలందరికీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. ఉపేందర్, ఎమ్డీ పాష, ఊషన్న, రాష్ట్ర కార్యదర్శులు రుద్రకుమార్, శంకర్, కోశాధికారి అజరుబాబు, పగడాల లక్ష్మయ్య, సతీష్, రాంబాబు, అమరయ్య తదితరులు పాల్గొన్నారు.