Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త కేసులు తగ్గుతూ.... రికవరీలు పెరుగుతున్న వైనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్-19 ప్రత్యేక ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య రోజు రోజూకు తగ్గిపోతున్నది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల కన్నా ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంటుండటంతో ఈ పరిణామం చోటు చేసుకుంటున్నది. చికిత్స పొందుతున్న వారి సంఖ్య ప్రభుత్వాస్పత్రుల్లో ఏకంగా 1000 లోపునకు, ప్రయివేటు ఆస్పత్రుల్లో 1500 లోపునకు రావటం గమనార్హం. ఒకవైపు థర్డ్ వేవ్ భయాందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారికంగా వెల్లడిస్తున్న మీడియా బులెటిన్ గణాంకాల ప్రకారం పరిస్థితి ఆశాజనకంగా ఉన్నట్టు వెల్లడిస్తున్నది. ఒకట్రెండు జిల్లాల్లో అకస్మాత్తుగా కేసులు పెరుగుదల కనిపిస్తున్నా గత పక్షం రోజులుగా అన్ని జిల్లాల్లో ఒకే రీతిగా కేసులు వస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
సెప్టెంబర్ ఒకటిన 322 కొత్త కేసులొస్తే అప్పటికే చికిత్స పొందుతున్న 331 మంది కోలుకున్నారు. రెండున కొత్తగా 313 మంది వైరస్ బారిన పడినట్టు పరీక్షల్లో వెల్లడి కాగా 354 మంది డిశ్చార్జి అయ్యారు. మూడున 318 మందిలో కోవిడ్-19 వెలుగు చూడగా ఏకంగా 389 మంది వ్యాధి నుంచి బయటపడ్డారు. నాలుగున 306 మంది రోగం బారిన పడితే అంతకన్నా 60 మంది ఎక్కువగా అంటే 366 వ్యాధి నుంచి విముక్తులయ్యారు. ఐదో తేదీన 230 కేసులు రాగా 357 మంది కోలుకున్నారు. అంటే కొత్త కేసుల కన్నా డిశ్చార్జి అయిన వారి సంఖ్య 127 అదనం. సోమవారం 339 మంది కోలుకున్నారు. ఈ సంఖ్య కన్నా 38 తక్కువగా 301 కేసులొచ్చాయి. దీంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ ప్రభుత్వాస్పత్రుల్లో 942కు, ప్రయివేటు ఆస్పత్రుల్లో 1,463కు చేరింది.
298 మందికి కరోనా....ఇద్దరి మరణం
రాష్ట్రంలో తాజాగా 298 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఇద్దరు మరణించారు. మంగళవారం విడుదల చేసిన బులెటిన్ లో పాజిటివ్ రేటు 0.43 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 68,097 మందికి టెస్టులు చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో 59,549 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 8,548 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,507 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,476 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కోలుకున్న 325 మందిని డిశ్చార్జి చేశారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 89 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా నాగర్ కర్నూల్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నల్లగొండ, నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదు
11 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో సోమవారంతో పోలిస్తే మంగళవారం జీహెచ్ఎంసీతో సహా 11 జిల్లాల్లో కేసులు పెరిగాయి. జగిత్యాల, జనగామ, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ - మల్కాజిగిరి, నల్లగొండ, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో కేసులు పెరిగాయి.
21 జిల్లాల్లో తగ్గిన కేసులు...
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం వరసగా మూడో రోజూ కూడా కేసుల్లో పెరుగుదల కానీ, తగ్గుదల కాని కనిపించలేదు.