Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ బోధనకే పరిమితమైన 723 ప్రయివేటు స్కూళ్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రత్యక్ష బోధన ప్రారంభమై వారం రోజులైనా ఇంకా 723 ప్రయివేటు పాఠశాలలు తెరుచుకోలేదు. అందులో ఎక్కువ భాగం ఆన్లైన్ బోధనకే పరిమితమైనట్టు తెలుస్తున్నది. విద్యార్థులు తరగతులకు హాజరయ్యేందుకు ఆసక్తి కనబరుస్తున్నా వాటి యాజమాన్యాలు అందుకు సిద్ధం లేవని సమాచారం.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఒకే యాజమాన్యం కింద ఎక్కువ పాఠశాలల్లో ఆన్లైన్ పాఠాలనే బోధిస్తున్నారు. ఎందుకంటే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించాల్సి వస్తుందనే ప్రధాన కారణంలో ప్రత్యక్ష తరగతులు నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వారికి సెలవులు ప్రకటించింది. ప్రత్యక్ష బోధన ఎన్ని నెలలు ఉంటుందో తెలియదు. ఇరుకు గదులు, వెంటిలేషన్ లేకపోవడం, విద్యార్థులకు ఇబ్బందులు రావడం వంటి సమస్యలూ ఉన్నాయి. విద్యార్థులకు కరోనా వస్తే యాజమాన్యాలే బాధ్యత వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు, సిబ్బందిని పాఠశాలలకు పిలిచి పాఠాలు బోధించాలని చెప్తే ఏడాదికి సంబంధించిన జీతాలు అడిగే అవకాశమూ లేకపోలేదని ఆయా యాజమాన్యాలు భావిస్తున్నాయి. అందుకే ఆన్లైన్ తరగతులనే కొన్ని రోజులు నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చాయి. అందుకే 723 ప్రయివేటు స్కూళ్లలో ఇంకా ప్రత్యక్ష బోధన ప్రారంభం కాలేదని అర్థమవుతున్నది. ఇంకోవైపు విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు ఆదేశాలూ ఉన్నాయి. మరోవైపు ఆన్లైన్లో పాఠాలు బోధించినా అవే ఫీజులు వస్తాయి. అందుకే ప్రత్యక్ష తరగతులు నిర్వహించి అదనంగా ఖర్చు ఎందుకు చేయాలన్న అభిప్రాయంతో కొన్ని యాజమాన్యాలు ఉన్నట్టు తెలుస్తున్నది.
పెరుగుతున్న హాజరు
మరోవైపు పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఈనెల ఒకటి నుంచి అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన విషయం తెలిసిందే.తొలిరోజు బుధవారం 21.77 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.ఆరోరోజు మంగళవారం 31.12 శాతం మంది వచ్చారు.అంటే 9.35శాతం మంది పిల్లలు అధికంగా వచ్చారు. సర్కారు బడుల్లో 16,80,562 మందికిగాను 7,06668 (41.05 శాతం) మంది హాజరయ్యారు.ఎయిడెడ్ స్కూళ్లలో 71,838 మంది ఉంటే, 15,948 (22.20శాతం) మంది వచ్చారు. ప్రయివేటు పాఠశాలల్లో 28,61,275 మందికిగాను,7,13,217(24.93శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు.