Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే వెబినార్లో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆవు ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ను వదులుతుందనేది పూర్తిగా అశాస్త్రీయం, రాజ్యాంగ విరుద్ధమని జీవ శాస్త్రవేత్త, ప్రముఖ రచయిత దేవరాజు మహారాజు అన్నారు.భారత రాజ్యాంగంలో వైజ్ఞానిక సృహ అవసరమని రాసుకున్నామనీ,దానికి విఘాతం కలిగినప్పుడు తప్పకుండా మాట్లాడాల్సి వస్తుందని చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో'ఆవు ఆక్సిజన్ వదుల్తుందా?'అంశంపై మంగళవారం జరిగిన వెబినార్లో ఆయన మాట్లాడారు.ప్రజలకు చెప్పే మాటలు, చేసే వాద నలు శాస్త్రీయ ప్రయోగానికి నిలబడాలని అన్నారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఆవు గురించి సైన్స్కు వ్యతిరేకంగా తన తీర్పులో ఉటంకించడం సరికాదన్నారు. అసలు ఆవు అనేదే మనువాదుల సొంత ఆలోచన కాదనీ,దేవుళ్లు కూడా కల్పిత పాత్రలేననీ, ఈజిప్ట్ సంస్కృతి నుంచి వాటిని తెచ్చుకున్నారని విశ్లేషించారు. ఆవును తల్లిగా భావిస్తే, ఎద్దును తండ్రిగా అంగీకరిస్తారా...అని ప్రశ్నించారు. ఎలాగైనా ఓ అజ్ఞానాన్ని నిజంగా మార్చి ప్రజల్ని ఏమార్చాలనే ప్రయత్నం జరుగుతు న్నదని విమర్శించారు.ప్రపంచం వైజ్ఞానిక ప్రగతివైపే వెళ్తుందన్నారు. బీటా కెరాటిన్ అనే పదార్థం వల్ల ఆవుపాలు పచ్చగా ఉంటాయని చెప్పారు.పీల్చే గాలిలో ఆక్సిజన్తో పాటు నైట్రోజన్ ఇతర అనేక వాయువులు ఉంటాయనీ, అది రక్తంలోకి హెమోగ్లోబిన్ రూపంలో వెళ్లి, తినే ఆహారం ద్వారా సంక్రమించే ధాతువుల్లో గ్లూకోజ్ ఏర్పడుతుందన్నా రు. ఈ నిశ్వాస ప్రక్రియలో వదిలిన గాలిలో శరీరం స్వీకరించని ఆక్సిజన్ స్వల్ప మోతాదులో బయటకు వస్తుందని వివరించారు. ఈ శ్వాసక్రియలో మనిషితో పాటు పాలిచ్చే జంతువులన్నింటి మధ్య ఎలాంటి తేడా లేదన్నారు. ఆవు ఆక్సిజన్ తీసుకొని, ఆక్సిజన్ వదులుతుందని సైన్స్ ఎక్కడా నిరూపణ చేయలేదనీ, అలా చెప్పేవారు మూర్ఖులేనని స్పష్టం చేశారు. బౌద్ధాన్ని నాశనం చేయడానికే జంతు బలి నిషేధం తీసుకొచ్చి, బుద్ధుడిని దశావతారాల్లో కలుపుకున్నారని అన్నారు. మానవజాతి పరిణామక్రమంలో మూలవాసుల్ని ఆర్యులు కులం, దేవుడు పేరుతో ఎలా ధ్వంసం చేశారో చరిత్ర స్పష్టంగా పేర్కొన్నదన్నారు. 'పవిత్రత' అనేది ఓ మానసిక భావన మాత్రమేననీ, గాడిద పాలలోనూ ఔషధ లక్షణాలు ఉన్నాయని అమ్ముతుంటారని గుర్తుచేశారు. చరిత్ర పరిశోధకులు, రిటైర్డ్ ఇంజినీర్ కెఎల్ కాంతారావు మాట్లాడుతూ ఆవుపాలు పల్చగా ఉండి, కొవ్వు తక్కువ ఉంటుందనీ పిల్లలకు, వృద్ధులకు త్వరగా జీర్ణం అవుతాయని తెలిపారు. మేకపాలు మరింత శ్రేష్టమని స్వయానా మహాత్మాగాంధీ చెప్పారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో మార్కెటింగ్ జరుగుతుందనీ, వాటిని ఎక్కడ ఎలా పండించారో నిర్ధారణ లేదన్నారు. గోవధ నిషేధం తర్వాత దేశంలో గోచర్మం దొరకట్లేదనీ, విదేశాల నుంచి దిగుమతి చేసుకొని చెప్పులు, ఇతర వస్తువులు తయారు చేస్తున్నారని ఉదహరించారు. ముసలి ఆవుల్ని కబేళాలను అమ్మేసే అవకాశం లేదనీ, వాటి పోషణ కోసం రోజుకు రూ.75 దాణా అవసరమవుతుందనీ, రైతు ఎక్కడి నుంచి తెస్తాడని ప్రశ్నించారు. ఆవును అడ్డుపెట్టి అంధవిశ్వాసాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమానికి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.