Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
- ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గణేష్ విగ్రహాల నిమజ్జనంపై నివేదికలను సమర్పించే తీరిక లేదా? అని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమజ్జనంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. గత ఆదేశాల అమలు తీరుపై తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసింది. నిమజ్జనం వేళ అమలు చేయాల్సిన ఆంక్షలు, నియంత్రణ, ఇతర మార్గదర్శకాలపై తాము ఇచ్చే ఆదేశాలను చూపించి విధిగా అమలు చేయాలని చెప్పినా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహిరించిందని తప్పుపట్టింది. జల, వాయు,శబ్ధ కాలుష్యం నియంత్రణకు చర్యలు తీసుకునే శ్రద్ధ సర్కార్కు లేనట్టుందని మండిపడింది. వ్యాజ్యంపై విచారణ చేపట్టడానికి కేవలం నిమిషాల ముందు ఉదయం 10.25 గంటలకు జీహెచ్ఎంసీ కమిషనర్ అఫిడవిట్ను హైకోర్టులో దాఖలు చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయడం వల్ల కాలుష్య కాసారంగా మారుతోందనీ, దీనిపై హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని అమలు చేయకుండా కోర్టుధిక్కార చర్యలకు పాల్పడుతోందని హైదరాబాద్కు చెందిన న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పును రిజర్వు చేసింది. ఇప్పుడే జీహెచ్ఎంసీ కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేశారనీ, కొద్ది నిమిషాల్లో సిటీ పోలీసు కమిషనర్ నివేదిక సమర్పిస్తారని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో హైకోర్టు మండిపడింది. ఎప్పుడో ఆదేశిస్తే నిమిషాల ముందు అఫిడవిట్ దాఖలు చేస్తారా? అని నిలదీసింది. సిటీ పోలీసు కమిషనర్కు నివేదికే ఇచ్చే సమయం లేనట్టుందని వ్యాఖ్యానించింది. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరితే అందుకు హైకోర్టు అంగీకరించలేదు. 'ఈనెల 2న ఆదేశిస్తే 7వ తేదీనాటికి అఫిడవిట్లు దాఖలు చేయలేదంటే మీలో శ్రద్ధ లేదని స్పష్టం అవుతోంది. శుక్రవారం నుంచి హైకోర్టుకు సెలవులు. తీరుబడిగా మీరిచ్చే నివేదికలను ఎప్పుడు చదవాలి'అని హైకోర్టు ప్రశ్నించింది.