Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ డిఫెన్సు ఆఫీసర్ రబియా సైఫీ(21)పై లైంగిక దాడికి ఒడిగట్టి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి, గ్రేటర్ హైద్రాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష కార్యదర్సులు ఎ.పద్మ, కె.నాగలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐద్వా గ్రేటర్ హైద్రాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గోల్కోండ క్రాస్రోడ్డులో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఢిల్లీలో పనిచేస్తున్న రబియాను అత్యంత క్రూరంగా హత్య చేసి ఫరీదాబాద్ పొదల్లో పడేయడం.. దేశంలో మహిళల రక్షణపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆమె శరీర భాగాలన్ని ఛిద్రమైపోయి.. శరీరంపై 50 కత్తిపోట్లు ఉన్నాయని, ఆమెపై దారుణంగా లైంగికదాడి జరిగినట్టుందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారని తెలిపారు. దేశ రాజధానిలోనే మహిళలకు రక్షణ లేకపోవడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందన్నారు. దీనిపై విచారణ జరిపి సత్వరం దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగరనాయకులు పి.విమల, షాబాన, వరలక్ష్మి, భవాని, ఉష, స్వరూప, అన్నపూర్ణ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.