Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దంచికొడుతున్న వర్షం
- వరదల్లో వేలాది ఇండ్లు
- బిక్కుబిక్కుమంటున్న జనం
- తెగిన చెరువులు, వాగులు
- గ్రామాలకు సంబంధాలు బంద్
తెలంగాణ తడిసి ముద్దవుతోంది.. వరదల్లో చిక్కుకుంటోంది.. వర్షం విడువకుండా దంచికొడుతుండటంతో.. ఇల్లూ.. వాడా తేడా లేకుండా వరద పోటెత్తుతోంది.. చెరువులు, వాగులు ఉగ్రరూపం దాల్చి రోడ్లు.. గ్రామాల్లోకి నీరు పారుతోంది. ఇండ్లన్నీ నీళ్లల్లో చిక్కుకున్నాయి. రోడ్లు తెగిపోయాయి. చాలా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రాజెక్టులు పూర్తిగా నిండి గేట్లు తెరుచుకున్నాయి.. కాలువల గుండా వరద ప్రవాహం ఎక్కువై రోడ్లను తాటుకుంటూ కాలనీల్లోకి చేరింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ముసురు వర్షం పడింది. శివారు ప్రాంతాలు ఇంకా వరద నుంచి బయటపడలేదు
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో వారం రోజులుగా భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలం అయ్యారు. ఇండ్లు ఉన్నా.. పునరావాసం కోసం పరుగులు తీస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రభుత్వ యంత్రాంగం బాధితులకు పునరావాసం ఏర్పాట్లు చేసింది. మంగళవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
అన్నపురెడ్డి మండలంలో అబ్బుగూడెం-రాజపురం గ్రామాల మధ్య వంతెన నెర్రెబారింది. దీంతో గామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెంలో సున్నంబట్టి, బై రాగులపాడు గ్రామాల మధ్య రహదారిని వరద ముంచెత్తడంతో రాకపోకలు నిలిచాయి. మణుగూరు మున్సిపాలిటీలో వరద బీభత్సం సృష్టించింది. సింగరేణిలో పూర్తిగా బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కూనవరం రైల్వేగేట్ వద్ద కోడిపుంజుల వాగు ప్రవాహం వల్ల రాకపోకలు నిలిచిపోయి సింగరేణి కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆళ్లపల్లిలో కిన్నెరసాని, జల్లేరు వాగుల వరద పెరగడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 34 అడుగులకు చేరుకుంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను వర్షం ముంచెత్తింది. ఎడతెరపిలేకుండా వర్షాలు కురవడంతో కాలనీలన్నీ జలమయమయ్యాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎస్సారెస్సీ 33 గేట్లు ఎత్తారు. నిజాంసాగర్ ప్రాజెక్టు గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. పలు ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ముంచెత్తడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్లో ఇండ్లల్లోకి వర్షపునీరు చేరడంతో బాధితులు ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని వరద ముంచెత్తింది.
వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరడంతో వాటంతట అవే 3 ప్రైమరీ సైఫన్ గేట్లు తెరుచుకున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇండ్లు వరద నీటితో నిండిపోగా.. మెజార్టీ రోడ్లు దెబ్బతిన్నాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అక్కన్నపేట మండల పరిధిలోని గౌరవెల్లిలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకు పోయి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఘనపూర్ ప్రాజెక్ట్ పొంగిపొర్లుతుండటంతో.. ఏడుపాయల వనదుర్గ మాత ఆలయాన్ని తాత్కాలికంగా మూసేశారు.
నిర్మల్ జిల్లాలో పంట పొలాల్లో నీరు చేరింది. ముధోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(బాలికలు)తో పాటు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో వర్షపు నీరు భారీగా చేరింది. స్వర్ణ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 8900 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.