Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
- 27న భారత్బంద్కు సంపూర్ణ మద్దతు
- సన్నాహక సదస్సులో కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 24న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దేశంలో కోటి మంది, రాష్ట్రంలో 2.50 లక్షల మంది స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వారి సర్వీసులను క్రమబద్ధీకరించేంత వరకు కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలని కోరారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న తలపెట్టిన భారత్బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్కీం వర్కర్ల రక్షణ, సామాజిక సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం ఈనెల 24న దేశవ్యాప్త సమ్మె సందర్భంగా రాష్ట్ర సన్నాహక సదస్సు మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్మిక సంఘాలైన సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, టీఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సుకు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమ, ఏఐటీయూసీ రాష్ట్ర కోశాధికారి పి ప్రేంపావని, ఐఎఫ్టీయూ నాయకురాలు ఎస్ఎల్ పద్మ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బివి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న స్కీంలను ప్రయివేటీకరించేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. వాటిలో పనిచేస్తున్న కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయన్నారు. స్కీంలను రక్షించుకోవాలనీ, కార్మికులు కదలాలని అన్నారు. పీహెచ్సీలను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు విద్యావైద్యం హక్కుతోపాటు ఆహార భద్రత కల్పించాలని కోరారు. స్కీంలను ప్రయివేటీ కరించే కుట్రలను కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఒక్క రోజు సమ్మెతోనే సమస్యలు పరిష్కారం కాబోవనీ, భవిష్యత్తులో నిరవధిక సమ్మెకు పూనుకోవాలని అన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు మాట్లాడుతూ పథకాలను ప్రజలకు అందించడం కోసం కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. వారి శ్రమకు తగ్గ ఫలితం లేదన్నారు. ఫ్రంట్లైన్ వర్కర్లుగా పనిచేసినా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని అన్నారు. కేంద్రంపై యుద్ధం చేయాలనీ, శ్రమకు తగ్గ ఫలితం రావాలనీ, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలకు కారణమైన ప్రధాని మోడీ సిగ్గుపడాలని విమర్శించారు. కరోనా సమయంలో ఫ్రంట్లైన్ వర్కర్లుగా పనిచేశారనీ, ఉద్యోగ భద్రత కోసం ఫ్రంట్లైన్లోకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ పథకాలను ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం మాట్లాడుతూ స్కీం వర్కర్లు వెట్టిచాకిరీ చేస్తున్నారనీ, అగౌరవ వేతనం తీసుకుంటున్నారని విమర్శించారు. మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.వెయ్యి జీతం ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజరుకుమార్ మాట్లాడుతూ ప్రజలకు సేవలందిస్తున్న స్కీం వర్కర్ల బతుకులు దయనీయంగా మారాయనీ, శ్రమదోపిడీకి గురవుతున్నారని చెప్పారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు శివబాబు మాట్లాడుతూ స్కీం వర్కర్లకు 12 నెలలు జీతాలివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం
'స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనీ, వారి సర్వీసుల క్రమబద్ధీకరణ కోసం 45,46వ అంతర్జాతీయ లేబర్ కాన్ఫరెన్స్ ప్రతిపాదనలు అమలు చేయాలనీ, వారికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలనీ, కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలనీ, కరోనా కాలంలో పనిచేసిన వారికి నెలకు రూ.7,500 బకాయిలతో సహా చెల్లించాలనీ, కోవిడ్ సోకిన వారికి రూ.10 లక్షలు, చనిపోయిన వారికి కేంద్రం ప్రకటించిన రూ.50 లక్షలు ఇవ్వాలనీ, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు బకాయిలివ్వాలనీ, వేసవిలోనూ జీతాలు చెల్లించే విధానం ప్రవేశపెట్టాలనీ, పదవీ విరమణ చేసిన స్కీం వర్కర్లకు నెలకు రూ.10 వేలు పింఛన్ ఇవ్వాలనీ, మధ్యాహ్న భోజన పథకంలో ఇస్కాన్, అక్షయపాత్రవంటి సంస్థలను నిషేధించాలనీ, ఐసీడీఎస్, ఎండీఎంఎస్ను ప్రయివేటీకరించొద్దనీ, ఆహారం, విద్యా హక్కు మాదిరిగా సార్వత్రిక ఆరోగ్య భద్రత హక్కు చట్టం తేవాలనీ, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఉపసంహ రించాలనీ, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ నిలిపివే యాలనీ, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయిలో అప్గ్రేడ్ చేయాలనీ, ఈనెల 27న భారత్బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం'అని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.
భవిష్యత్ కార్యాచరణ
- ఈనెల 10లోపు వివిధ స్థాయిల్లో సమ్మె నోటీసులు ఇవ్వాలి
- ఈనెల 8 నుంచి 15లోపు జిల్లా సదస్సులు అన్ని సంఘాలూ కలిసి నిర్వహించాలి
- ఈనెల 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్ బహిరంగసభ
- సమ్మెపై క్షేత్రస్థాయిలో కరపత్రాలు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం జరపాలి
- ఈనెల 24న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మండల, జిల్లా స్థాయిలో ప్రదర్శనలు, సభలు నిర్వహించాలి
- స్కీం వర్కర్ల సమ్మెకు లబ్దిదారులు, సామాన్య ప్రజానీకం మద్దతు కూడగట్టాలి.