Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా నేత కేసీఆర్ను ఒక్కమాటంటే.. పదంటాం
- ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం
- పేరుకే ఢిల్లీ పార్టీలు.. చేసేవి సిల్లీ పనులు
- టీపీసీసీ, టీబీజేపీ కేసీఆర్ భిక్ష కాదా? : టీఆర్ఎస్ నగర విస్తృతస్థాయి సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
'ఇంతకాలం ఓపిక పట్టాం. ఇక నుంచి ఊరుకోం.. మా నేత కేసీఆర్ను ఒక్క మాటంటే.. మేం పది అంటాం. పేరుకే ఢిల్లీ పార్టీలు.. చేసేవి సిల్లీ పనులు. టీకాంగ్రెస్, టీబీజేపీ.. కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు పదవులు వచ్చాయంటే కేసీఆర్ వల్లే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ పుణ్యమా అని పదవులు రాగానే.. గంజిలో ఈగల్లాగా ఎగిరిపడుతున్నారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. వయసులో మీ కంటే 20 ఏండ్ల పెద్ద మనిషిని పట్టుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న పుట్టిన చిల్లరగాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. ప్రత్యర్థుల విమర్శలను దీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది' అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జలవిహార్లో మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులతో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే 60లక్షల సభ్యులు ఉన్న ఎకైక పార్టీ టీఆర్ఎస్ అని, టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని అన్నారు. 70 ఏండ్లలో తెలంగాణ ప్రజలకు కరెంట్, తాగునీరు ఇవ్వలేని దౌర్భాగ్యం మీదని, 24 గంటల కరెంట్ తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? నల్లగొండలో ఫ్లోరోసిస్ లేదని కేంద్రమే పార్లమెంట్లో చెప్పిందని, అది తెలంగాణకు గర్వకారణం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. కేసీఆర్పై అవాకులు చవాకులు పేలితే బరాబర్ సమాధానం చెప్తామని, కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదని, సైలెంట్గా ఉండేకొద్దీ మాటలు ఎక్కువవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన వారిని తప్పకుండా గౌరవించుకుంటామని స్పష్టం చేశారు. పదవులు రాక కొంత మంది నిరాశతో ఉన్నారని, దసరా తర్వాత 500 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని, జీహెచ్ఎంసీ పరిధిలో కో-ఆప్షన్ సభ్యులను నియామకం కూడా పూర్తి చేస్తామన్నారు. పార్టీ గౌరవాన్ని పెంచే విధంగా పని చేయాలని, బస్తీ, డివిజన్ కమిటీలకు ఇచ్చే ప్రాధాన్యతను సోషల్ మీడియా కమిటీలకు ఇవ్వాలని సూచించారు. దసరా, దీపావళి తర్వాత కమిటీలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. ప్రభుత్వ పథకాలపై విస్తత అవగాహన కల్పిస్తామన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. 'పొట్టిగా గింత ఉంటడు.. గట్టిగా పిసికితే గిలగిల కొట్టుకుంటడు. మా పర్సనాలిటీలు ఎక్కడ.. మీ పర్సనాలిటీలు ఎక్కడీ మాట్లాడే ముందు కనీసం ఎదుటివాడి పర్సనాలిటీ చూసైనా ఆలోచించాలి కదా?' అంటూ ఎద్దేవా చేశారు. విపక్ష నేతల మాటలు భరింపరానివిగా ఉంటున్నాయని, అయితే కేటీఆర్ వల్లే తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. కేటీఆర్ ఈ అంశంలో ఓ నిర్ణయం తీసుకోవాలని, ఇక విపక్ష నేతలను ఉపేక్షించేది లేదని అన్నారు. తాము కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మెన్లు, కార్పొరేటర్లు, పార్టీనేతలు పాల్గొన్నారు.