Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో 13న నిర్వహణ
- గిరిజనులపై దాడులు ఆపాలి
- భూమి హక్కుల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమం : అఖిల పక్ష సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు రైతుల భూమి హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిలపక్ష నాయకులు ప్రకటించారు. అందుకు తగిన కార్యాచరణను మంగళవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు వెల్లడించారు. ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షతన జరిగి ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 11లక్షల ఎకరాల పోడు భూములున్నాయని తెలిపారు. లక్షలాది మంది తమ భూములకు పట్టాలివ్వాలని దరఖాస్తులు పెట్టుకున్నా..ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చెప్పారు. కేసీఆర్ ఏడేండ్ల పాలనలో ఒక్క ఎకరానికి కూడా హక్కు పత్రాలు ఇవ్వలేదన్నారు. పైగా పోడు రైతులపై దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారని చెప్పారు. పంటలను ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ రెక్కల కష్టంతో బతుకు సాగిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు, దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అడవి నుంచి గిరిజనులను గెంటివేసే కుట్రకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని వివరించారు. తద్వారా అటవి సంపద, ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ చాలా సందర్బాల్లో చెప్పారని గుర్తుచేశారు. అసెంబ్లీ సాక్షిగా తక్షణం గిరిజనుల పోడు సమస్యను పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు, కానీ.. ఇప్పుడు దాని ఊసే ఎత్తటం లేదని చెప్పారు. వాస్తవంగా గిరిజనుల బతుకులు దినదిన గండంగా సాగుతున్నాయన్నారు. వారు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇచ్చేంత వరకు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీ, దళిత, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని విమర్శించారు. గిరిజనులు భూమే తమ సర్వస్వం అని భావించి, అడవిని కాపాడుతూ తమ బతుకులను వెళ్లదీస్తున్న క్రమంలో ప్రభుత్వం అనుచితంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. నోరులేని గిరిజనులు, పేదలపై ఫారెస్టు అధికారులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడేండ్ల కాలంలో సుమారు ఆరు వేల కోట్లతో ఆడువులు పెంచుతున్నమని చెప్పి,పోడు భూములల్లో, సాగు భూములల్లో కందకాలు తవ్వి, కంచెలు వేసి,పారిశ్రామిక అధిపతులకు ఉపయోగపడే యూకలిప్టస్, జమాయిల్ చెట్లను పెంచుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పెంచిన అడువులు కేవలం 0.8శాతంమేనని తెలిపారు. అడవినంతా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం తయారు చేస్తున్నదని విమర్శించారు. గిరిజనులమీద జరుగుతున్న అనేక దురాఘతాలకు వ్యతిరేకంగా, చంటిపిల్లల్ని సైతం వదలకుండా జైళ్లల్లో కుక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలకు నిరసనగా సాగే ఉద్యమంలో భాగస్వాములవుతామని తెలిపారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల మీద దాడి జరుగుతుందని చెప్పారు. హరిత హారం పేరుతో జరుగుతున్న తంతు వారిని అడవి నుంచి గెంటేసేందుకేనన్నారు. సాగు చేసుకుంటున్న భూములను ఖాళీ చేసే కుట్రలో భాగంగా తప్పుడు కేసులు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని విమర్శించారు.
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.రంగారావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఆదివాసీలను అడవిలోనుంచి వెళ్లగొట్టే వైఖరితప్ప, మరొకటి కాదని చెప్పారు. అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా హరిత హారం పేరుతో వాళ్లను అడవుల్లోనుంచి వెళ్లగొట్టి, ఆ భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టటానికి కుట్ర చేస్తున్నారని వివరించారు. ఇందులో భాగంగానే పసి పిల్లలను సైతం వదలకుండా కేసులు పెడుతున్నారని చెప్పారు.కుర్చీ వేసుకుని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న పెద్దమనిషికి ఏడేండ్లుగా కుర్చీ దొరకలేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు సతీష్, జనసేన నాయకులు శంకర్, సీపీఐ(ఎంఎల్)నాయకులు ప్రసాద్, అంబటి నాగయ్య, ఉషాసీతాలక్ష్మి, అరుణ్కుమార్, శ్రీరాంనాయక్, ధర్మానాయక్, అంజయ్యనాయక్ తదితరులు మాట్లాడారు.
కోదండరామ్ మాట్లాడుతూ పోడు రైతుల భూమి హక్కుల పరిరక్షణ కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ,ఎంసీపీఐ, సీపీఐ(ఎంఎల్), జనసేన, తెలంగాణ జనసమితి, ప్రజాసంఘాల నుంచి తుండుదెబ్బ, రైతు స్వరాజ్యవేదిక, విద్యావంతుల వేదిక, మహిళారైతు వేదిక, ఈ ఐక్య పోరాట కమిటీలో ఉన్నాయని చెప్పారు. అటవీ హక్కుల చట్టాన్ని, పీసా చట్టాన్ని అమలు చేసి పోడు రైతుల భూమి హక్కులను కాపాడలని డిమాండ్ చేశారు. వాటి పరిరక్షణ కోసం జరిగే కార్యాచరణను ప్రకటించారు.