Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తూరు నుంచి సీఐటీయూ పాదయాత్ర
- నలుగురు సభ్యుల టీం నడక
- కార్మిక కోడ్ల రద్దు, కనీసవేతనాల జీవోల విడుదల డిమాండ్
- సంగారెడ్డిలో ఈ నెల 30న ముగింపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్లను రద్దు చేయాలనీ, కనీస వేతనాలను జీవోలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక గర్జనపేరుతో సీఐటీయూ పాదయాత్రచేపట్టనున్నది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు నుంచి మొదలయ్యే ఈ పాదయాత్రలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, పి.విజయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, భూపాల్ తో కూడిన బృందం నడవనున్నది. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఈ యాత్రను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల పరిధిలోని 42 పారిశ్రామిక వాడల్లో పర్యటించనున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, కార్మికులను చైతన్యపరుస్తూ ముందుకు సాగనున్నది. సంగారెడ్డిలో 30న ముగుస్తుంది.
కార్మిక కోడ్లతో నష్టమే..
పరిశ్రమలో సంఘం పెట్టుకునే హక్కును, ఉద్యోగభద్రత, 8 గంటల పనివిధానం, వెట్టిచాకిరీ, ఈఎస్ఐ, పీఎఫ్, తదితర హక్కులను స్వాతంత్య్రానికి ముందు, ఆతర్వాత జరిగిన అనేక పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్నారు. అవే నేడు అమలవుతున్నాయి. కార్మికులకు ఇతోధికంగా దోహదపడుతున్న చట్టాలు పారిశ్రామికవేత్తలకు కంటగింపుగా మారాయి. ఈ నేపథ్యంలోనే వాటిని రద్దు చేయాలని మోడీ సర్కారుపై ఒత్తిడి తెచ్చారు. వారి ఆర్థిక అండదండలతోనే కొనసాగు తున్న మోడీ సర్కారు వారికి మేలు చేయాలనే తప నతో కార్మికుల పొట్టగొడుతున్నది. కార్పొరేట్లకు ప్రయోజనాలు, అధిక లాభాలు వచ్చేలా కార్మిక కోడ్ల ను తీసుకొచ్చింది. వేతనాలకోడ్, పారిశ్రామిక సం బంధాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిపరిస్థితుల పేరుతో కోడ్లను తీసుకొచ్చింది. దీని ఫలితంగా కేంద్రం పరిధిలోని 44, రాష్ట్రాల్లోని 100 కార్మిక చట్టాలు రద్దయ్యాయి. పరిశ్రమల్లో కనీసం యూనియన్ పెట్టుకునే అవకా శం కూడా ఉండదు. దీని ఫలితంగా కంపెనీల మూ సివేత, లేఆఫ్, లాకౌట్, కార్మికుల తీసివేత విష యంలో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రమాదం పొంచి ఉంది. అదే సమయంలో 12 గంటల విధానం తెరపైకి తీసుకొస్తున్నారు. దీని వల్ల కార్మికులు మరింత శ్రమ దోపిడీకి గురికానున్నారు. కోడ్ల వల్ల కార్మికులకు ముంచుకురానున్న ఉపద్రవాన్ని వివరిస్తూ చైతన్య పరిచే కార్యక్రమానికి సీఐటీయూ పూనుకున్నది.
వేతన సవరణ జీవో విడుదలలో జాప్యం... కార్మికుల నుంచి వేల కోట్ల రూపాయల దోపిడీ
పెరిగిన నిత్యావసరాల ధరలు, కుటుంబ పోషణ, రవాణా ఖర్చులు, ఇంటి అద్దెలు, తదితరాలను దృష్టి లో పెట్టుకుని ప్రతి పరిశ్రమలోనూ వేతనాలను పెం చాలి. ఒకవేళ పరిశ్రమలు వెనుకడుగు వేసేందుకు ప్రయత్నించినా కార్మికుల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చట్టం ప్రకా రం ఐదేండ్లకోసారి వేతన సవరణ జీవోలను విడుదల చేయాలి. దాని ప్రకారం వేతనాలు పెరగాలి. కానీ, టీఆర్ఎస్ సర్కారు వచ్చిన ఈ ఏడున్నరేండ్లలో కనీస వేతనాల జీవోలు విడుదల చేసిన పాపాన పోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10,15 ఏండ్ల కింద విడుద లైన జీవోల ఆధారంగా నిర్ధారించిన వేతనాలే నేడు కార్మికులు పొందుతున్నారు. కనీస వేతనాల నిర్ణయ సలహా మండలి కార్మికులకు 21వేల వేతనం ఇవ్వాల ని సూచించింది. చివరకు కనీసం రూ.18 వేల రూపాయలైనా ఇవ్వాలని కోరింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తే సరిపోతుంది. పరిశ్రమలే వాటి ప్రకారం వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రభుత్వంపై పైసా భారం కూడా పడదు. పరిశ్రమల యాజమాన్యాల ఒత్తిడి మేరకు రాష్ట్ర సర్కారు జీవో విడుదలకు తాత్సారం చేస్తున్నది. దీని వల్ల ఏడున్నరేండ్ల కాలంలో కార్మికులు కోట్లాది రూపాయలను నష్టపోయారు. వేతనాలు పెరుగుతాయని ఎంతో ఆశపడి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కార్మికులు ముందుండి కొట్లాడారు. కానీ, నేడు అదే కార్మికులకు మేలు చేసేందుకు టీఆర్ఎస్ సర్కారుకు చేతులు రావడం లేదు.
కోడ్ల రద్దు, కనీస వేతనాల జీవోల కోసమే ఈ యాత్ర
పాదయాత్ర ప్రారం భం కాబోతున్న కొత్తూ రు పారిశ్రామిక వాడ లోని ఏడెనిమిది వేల మంది కార్మికులు ప్రతినెలా 8 నుంచి 9కోట్ల రూపాయ లను నష్టపోతున్నారు. ఇలా లెక్కేసుకుంటే ఏడున్నరేండ్ల కాలంలో అక్కడి కార్మికులే 700 కోట్ల రూపాయలకుపైగా శ్రమదోపిడీకి గురయ్యారు. రాష్ట్రం మొత్తం మీద చూస్తే ఇలా వేల కోట్లు నష్టపోయారు. కనీసవేతనాల విషయంలో జరుగు తున్న అన్యాయంపై కార్మికులను చైతన్యపరుస్తాం. అన్నింటి కంటే కార్మిక కోడ్లు ఇంకా ప్రమాదకరం. వీటివల్ల కార్మికులు కట్టుబానిసలయ్యే ప్రమాదం పొంచి ఉంది. పరిశ్రమలకు లాభాలు చేకూర్చేం దుకు కార్మికుల పొట్టగొట్టడం మోడీ సర్కారుకు తగదు. రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువ నగిరి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని 42 పారిశ్రామిక వాడల్లో ఈ పాదయాత్ర చేపడుతు న్నాం. ప్రతి కార్మికున్నీ కలిసి వారి ఇబ్బందులు, బాధలను తెలుసుకుంటాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అనురిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ హక్కులను కాపాడుకునేందుకు వారు పోరాటాల్లోకి వచ్చేలా చైతన్యపరుస్తాం.
- జె.మల్లిఖార్జున్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పాదయాత్ర సమన్వయకర్త