Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 4.31 ఎకరాల వివాదంపై హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఆ భూమి విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని బుధవారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ వినోద్కుమార్ల డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలిచ్చింది. యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 1976లో గచ్చిబౌలి ఏరియాలో 2,300 ఎకరాలను కేటాయించింది. ఇందులో పాతిక ఎకరాలు ప్రైవేట్ భూములు ఉన్నాయి. యూనివర్సిటీకి కేటాయింపును సవాల్చేస్తే ప్రయివేటు వ్యక్తుల భూమేనని గతంలో కోర్టు తేల్చింది. దీంతో భూసేకరణ ద్వారా ప్రయివేటు భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ తర్వాత వెనక్కి తగ్గింది. 2008లో ఆ భూమి ప్రయివేటు వ్యక్తులదేనని జీవో ఇచ్చింది. దీనిపై యూనివర్సిటీ రిట్ దాఖలు చేస్తే ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ యూనివర్సిటీకి వ్యతిరేకంగా సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు.
దీంతో యూనివర్సిటీ వేసిన అప్పీల్ పిటిషన్ను బుధవారం డివిజన్ బెంచ్ విచారించింది. భూమికి భూమి ఇచ్చేందుకు యూనివర్సిటీ, ప్రయివేటు వ్యక్తుల మధ్య ఒప్పదం జరిగిందని, వివాదం 4.30 ఎకరాల విషయంలోనే అని యూనివర్సిటీ హైకోర్టుకు చెప్పింది. దీంతో ఈ భూమి విషయంలో హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రయివేటు భూ యజమానులు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. 'కేంద్ర ప్రభుత్వ సంస్థల విషయంలో ఇలాంటి లిటిగేషన్లు ఏర్పడితే కేంద్రం నుంచి ప్రభుత్వ సంస్థలు తెలంగాణకు ఎలా వస్తాయి?' హైకోర్టు ప్రశ్నిస్తూ, విచారణను నవంబర్కు వాయిదా వేసింది.