Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 కాలేజీల్లో వందశాతం భర్తీ
- 9 వరకు కళాశాలల్లో చేరేందుకు గడువు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు పాలిసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో 6,687 సీట్లు మిగిలిపోయాయని వివరించారు. 16 పాలిటెక్నిక్ కాలేజీల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. ఇందులో 15 ప్రభుత్వ, ఒక ప్రయివేటు కాలేజీ ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 120 కాలేజీల్లో 29,054 సీట్లున్నాయనీ, 22,367 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించామని వివరించారు. 54 ప్రభుత్వ కాలేజీల్లో 11,874 సీట్లుంటే, 10,718 (90.26 శాతం) మందికి, ఒక ఎయిడెడ్ కాలేజీలో 230 సీట్లకుగాను 213 (92.60 శాతం) మందికి, 65 ప్రయివేటు కాలేజీల్లో 16,950 సీట్లుంటే 11,436 (67.46 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. సీట్లు కేటాయించిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు, ట్యూషన్ ఫీజు చెల్లింపునకు ఈనెల 9 వరకు గడువుందని పేర్కొన్నారు. ఈనెల 9లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్్జూర://్రజూశీశ్రీyషవ్.అఱష.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.