Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న అధికారుల కసరత్తు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో 143 ఇంజినీరింగ్ కాలేజీలకు ఇప్పటి వరకు అనుబంధ గుర్తింపు లభించినట్టు తెలిసింది. విశ్వవిద్యాలయాల అధికారులు ఇంకా వేగవంతంగా కసరత్తు చేస్తున్నారు. ఈనెల 11 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియలో వెబ్ఆప్షన్లు ప్రారంభమవుతుంది. ఈలోపు కాలేజీలకు అనుబంధ గుర్తింపు, సీట్ల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. ఈ దిశగా అధికారులు పనిచేస్తున్నారు. ఎన్ని కాలేజీలుంటాయి, ఎన్ని సీట్లుంటాయన్న దానిపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో 148 ఇంజినీరింగ్ కాలేజీలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటి వరకు 108 కాలేజీలకు, ఓయూ పరిధిలో మరో 11 కాలేజీలు కలిపి 119 కాలేజీలకు గుర్తింపు లభించినట్టు సమాచారం. అయితే 143 ఇంజినీరింగ్ కాలేజీలకు గుర్తింపు ప్రకటించినట్టు కౌన్సెలింగ్ వెబ్సైట్లో పొందుపరచడం గమనార్హం.
అధ్యాపకుల సమస్యలు పట్టవా? : టీఎస్టీసీఈఏ
కాలేజీల అనుబంధ గుర్తింపు సరే అధ్యాపకుల సమస్యలు పట్టవా?అని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అవసరం లేదా?అని తెలిపారు. అధ్యాపకుల సమస్యలను పరిష్కరించకుండా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. చాలా కాలేజీల్లో అధ్యాపకులకు జీతాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వేతన సంఘం సిఫారసుల ప్రకారం జీతాలు ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల అధికారులు స్పందించి తక్షణమే అధ్యాపకులందరికీ జీతాలు చెల్లించేలా చూడాలని కోరారు. అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ ద్వారా హాజరును అమలు చేయాలని సూచించారు.