Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఎస్పీడీసీఎల్-ఈఈఎస్ఎల్ మధ్య
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుత్ ఉపకరణాల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచే దిశగా తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)ల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రజలు నాశిరకం విద్యుత్ పరికరాల వినియోగించడం వల్ల తరచూ ప్రమాదాలు జరగడంతో పాటు విద్యుత్ దుర్వినియోగం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం చేసుకున్నట్టు డిస్కం సీఎమ్డీ జి రఘుమారెడ్డి తెలిపారు. ఈ మేరకు అవగాహనా ఒప్పందం (ఎమ్ఓయూ) పై సంతకాలు చేసినట్టు వివరించారు. వినియోగదారులను అధిక సామర్థ్యం గల ఉపకరణాలను కొనుగోలు చేసేలా ఈ సంస్థ ప్రోత్సహిస్తుందని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా దీన్నీ డిస్కం పరిధిలో చేపడుతున్నారనీ, తమ సంస్థపై ఎలాంటి ఆర్థిక భారం ఉండబోదనీ తెలిపారు. దీనికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సీఐఐ) ద్వారా సాంకేతిక మద్దతు ఉంటుందన్నారు. అత్యంత సాంకేతిక నైపుణ్యం, నాణ్యత కలిగిన ఎయిర్ కండీషనర్లు, ఐఈ3 మోటార్లు, బీఎల్డీసీ ఫ్యాన్ల తయారీ, వినియోగంపై ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఐఏ)తో కలిసి ఈ ప్రాజెక్ట్ను చేపడుతున్నట్టు వివరించారు. దీనివల్ల ఇంధన పొదుపు సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ఎనర్జీ ఆడిట్, డీపీఈ అండ్ అసిస్టెంట్) జీ గోపాల్, సీజీఎమ్(ఈఏ) రంగనాథ్రారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎల్) ఎస్పీ గార్నాయక్, ఈఈఎస్ఎల్ క్లస్టర్ హెడ్ (లైటింగ్) సావిత్రి సింగ్ పాల్గొన్నారు.