Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ బుధవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ కోర్సు కాల వ్యవధి ఐదు నెలలు మాత్రమేనని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్లో కోర్సు ప్రారంభమై వచ్చే ఏడాది జనవరిలో ముగుస్తుందని వివరించింది. కాచిగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, జడ్చర్లలోని జ్ఞానసాయి లైబ్రరీ సైన్స్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్నగర్లోని నవీన్ వివేకానంద కాలేజ్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కోర్సుల్లో ఇంగ్లీష్ మీడియంలో 40 సీట్లు, తెలుగు మీడియంలో 40 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఇంటర్మీడియట్ లేక తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వివరించింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 23వ తేదీలోపు దరఖాస్తులను సంబంధిత కాలేజీల యాజమాన్యాలకు పంపాలని తెలిపింది. పోస్టల్ ద్వారా లేదా నేరుగా దరఖాస్తులను సమర్పించొచ్చని పేర్కొంది. అర్హత పరీక్షలు సాధించిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఒకేషనల్ కోర్సులు చేసిన వారు ఈ కోర్సుకు అనర్హులని తెలిపింది. అదనపు అర్హతలు గలవారికి డిగ్రీకి ఐదు, పీజీ చేసినవారికి పది మార్కులు కలుపుతామని వివరించింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుందని పేర్కొంది. మహిళలకు 33 శాతం, ప్రభుత్వ గ్రంథాలయాలు, గ్రంథాలయ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పది శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని తెలిపింది.