Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్.డీ.ఏ)లో మహిళలకు అవకాశమివ్వటం గొప్ప విషయమనీ, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలకు అవకాశమిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపిందని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో గొప్పగా రాణిస్తారనీ, ఇది చరిత్ర చెప్పిన సత్యమనీ, అంతరిక్షంలో కూడా వారు అడుగు పెట్టారని చెప్పారు. కొన్ని శతాబ్దాల క్రితమే మన దేశంలో రాణీ రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, రజియా సుల్తానా వంటి మహిళలు యుద్ధ రంగంలో వీరోచితంగా పోరాటాలు చేసిన చరిత్ర ఉందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ఆ అకాడమీలో కూడా మహిళలు గొప్పగా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారనీ, యూపీపీఎస్సీ ద్వారా ఈ అడ్మిషన్లు జరుగుతాయని వివరించారు.
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు, గురుకుల పాఠశాలలోని ఇంటర్ విద్యార్థినులకు ఎన్.డీ.ఏ. లో అడ్మిషన్ల కోసం లెక్చరర్లు చొరవ తీసుకోవాలనీ, ఆ దిశగా కృషి చేయాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ ఉమర్ జలీల్ కు ఆయన సూచించారు.