Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరవీరుడు రామకృష్ణ 21వ వర్థంతి సభలో వక్తలు
నవతెలంగాణ-ముషీరాబాద్/సరూర్నగర్
విద్యుత్ రంగం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గుమ్మడి రాజు నరేష్ అధ్యక్షతన విద్యుత్ ఉద్యమంలో అసువులు బాసిన సత్తెనపల్లి రామకృష్ణ 21వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.రాములు మాట్లాడుతూ.. 2000లో జరిగిన చారిత్రాత్మక విద్యుత్ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాల ఫలితంగా విద్యుత్ రంగం ప్రయివేటీకరణకు అడ్డుకట్టవేయగలిగామని చెప్పారు. ఆ పోరాట ఫలితంగానే రైతులకు, పేదలందరికీ ఉచిత విద్యుత్తును సాధించామని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. మళ్లీ విద్యుత్రంగ సంస్థలను ప్రయివేటుపరం చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోందన్నారు. ఇటువంటి ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకే దేశం, ఒకే చట్టం పేరుతో కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య మాట్లాడుతూ.. రజక వృత్తిదారుల కోసం ఉద్యమంలోకి వచ్చిన కొద్దికాలంలోనే విద్యుత్ ఉద్యమంలో రామకృష్ణ అసువులు బాసారని చెప్పారు. రామకృష్ణ పోరాట స్ఫూర్తితో రజక వృత్తిదారులకు 50 యూనిట్ల ఉచిత విద్యుత్ సాధించామని తెలిపారు. రామకృష్ణ ఉద్యమస్ఫూర్తితో ప్రజలు హక్కులు సాధించుకోవాలని సూచించారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎన్వి.రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సరళీకరణ విధానాలతో చేతివృత్తిదారులు ఉపాధి కోల్పోతున్నారని, ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే అమరవీరులకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు దుర్గారావు, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామ్ నాయక్, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, బాలకష్ణ, సోమయ్య, శ్రీరాములు, కష్ణ స్వామి తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లి రామకృష్ణ 21వ వర్థంతిని సంతోష్నగర్లోని సీఐటీయూ ఆఫీసులోనూ నిర్వహించారు. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.