Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4 అంగుళాల మేర విడిపోయిన అంతర్రాష్ట్ర బ్రిడ్జి
పూర్తిగా నీట మునిగిన రాతి వంతెన
నవతెలంగాణ-బోధన్
నిజామాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రకు రాకపోకలు సాగించేందుకు కీలకంగా ఉన్న బోధన్ మండలంలోని సాలూర బ్రిడ్జి నాలుగు అంగుళాల మేర విడిపోయింది. దాంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అంతేకాదు, పాత రాతి వంతెనపై నుంచి మంజీరా నది ప్రవహిస్తుండటంతో ఆ బ్రిడ్జిపై నుంచి సైతం రాకపోకలను నిషేధించారు. దాంతో మహారాష్ట్రకు వెళ్లేందుకు బాన్సువాడ నుంచి దెగ్లూర్ మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
భారీ వర్షాల కారణంగా బోధన్ మండలం సాలూర వద్ద గల మంజీర నదికి వరద నీటి ఉధృతి పెరగడంతో పురాతన రాతి వంతెన నీట మునిగింది. వంతెనపై నుంచి సుమారు 4 అడుగుల మేరకు నీటి ప్రవాహం ఉంది. గతేడాది నుంచి ఈ వంతెనపై నుంచే వాహనాల రాకపోకలు కొనసాగాయి. ప్రస్తుతం వంతెన నీట మునగడంతో పెద్ద వంతెన నుంచి తేలికపాటి వాహనాల రాకపోకలు సాగాయి. గత కొన్నేండ్లుగా పెద్ద వంతెన మరమ్మతు పనులు మహారాష్ట్ర అధికారులు చేపట్టారు. ప్రస్తుతం కొన్ని వాహనాలు ఈ వంతెనపై నుంచి వెళ్లడంతో వంతెన 4 అంగుళాల మేరకు విడిపోయి గ్యాప్ ఏర్పడింది. దాంతో అప్రమత్తయిన మహారాష్ట్ర తహసీల్దార్ చంద్రకాంత్ వంతెనను పరిశీలించి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. అధికారులు వాహ నాలను అనుమతించకపోవడంతో మహారాష్ట్ర - తెలంగాణా ప్రాంతాలకు వెళ్ళే వారు సాలూర చెక్ పోస్ట్ నుంచి అటువైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగే మంజీర నది సమీపంలో గల పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. అంతరాష్ట్ర రాకపోకలు బంద్ కావడంతో బోధన్ వచ్చే వారు దెగ్లూర్ నుంచి బాన్సువాడ మీదుగా బోధన్ రావలసి ఉంటుంది. దాంతో ప్రయాణికులకు దూరాభారం పెరుగుతుంది.