Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుర్చీ లేకపోతే ఇస్తాం.. పోడు సమస్యకు పరిష్కారం చూపండి
- రెవెన్యూ, ఫారెస్టు శాఖలు ఉమ్మడి సర్వే చేయించాలి
- గిరిజన రైతుల పట్ల నిర్బంధాన్ని ఆపాలి
- చట్టం ప్రకారం హక్కు పత్రాలు సాధిస్తాం
- వ్యకాస రాష్ట్ర సదస్సులో జి నాగయ్య
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కుర్చీ వేసుకుని కూర్చొని పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా హామీనిచ్చిన సీఎం కేసీఆర్ ఆతర్వాత దాన్ని విస్మరించారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి నాగయ్య విమర్శించారు. కుర్చీ లేకపోతే తాము ఇస్తామని, అక్కడ కూర్చుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సాగు భూమి కోసం సావుకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. వెంటనే రెవెన్యూ, ఫారెస్టు శాఖలు ఉమ్మడిగా పోడు భూములను సర్వే చేయించి, సాగుదార్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 'పోడు సాగుదార్లపై నిర్బంధం ఆపాలి-హక్కుపత్రాలు ఇవ్వాలనే అంశంపై ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బురిప్రసాద్ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు జరిగింది. పోడు సాగుదార్లపై సమస్యలపై పలు తీర్మానాలు చేశారు.ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ పోడుసాగుదార్లకు ఆ భూములను పంచాలనీ, దాడులు, దౌర్జన్యాలు ఆపాలని డిమాండ్ చేశారు. గిరిజనుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతున్నదని విమర్శించారు. చేతికొచ్చిన పంటలను పీకేయడం, దున్నేయడం, మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం దారుణమని అన్నారు. ఆ బాధను తట్టుకోలేక రైతులు అధికారులపై ఎదురుతిరుగుతున్నారనీ, దాన్ని తట్టుకోలేక గిరిజన మహిళలను పోలీసులు జైల్లో పెడుతున్నారని విమర్శించారు.
దశాబ్దాల కాలంపాటు పోరాడిన ఫలితంగా అటవీ హక్కుల చట్టం వచ్చిందన్నారు. దాన్ని అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు.
రెవెన్యు రికార్డుల్లో ఉన్న భూమిని సాగు చేస్తున్న రైతులపై ఫారెస్టు అధికారులు దాడులు చేస్తున్నారనీ, ఆదాడులను వెంటనే ఆపాలని హెచ్చరించారు. గ్రామసభలో తీర్మానం ఆమోదం పొందితే దాని ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలంటూ చట్టంలో పేర్కొన్నా...రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటున్నదని చెప్పారు. ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ పోడు సాగుదార్ల సమస్యలపై పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు. అటవీ సంపదను కార్పొరేట్లకు దొచ్చిపెట్టేందుకే పోడు సాగుదార్లకు పట్టాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పొన్న వెంకటేశ్వరరావు, మచ్చ వెంకటేశ్వర్లు, పెద్ది వెంకట్రాములు మాట్లాడారు.