Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయుధ పోరాటాన్ని అధికారికంగా జరిపేందుకు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
- బండి సంజరుది ప్రజా దగా యాత్ర : చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న జరిగే భారత్బంద్కు టీఆర్ఎస్, వైసీపీ మద్దతివ్వాలనీ, రైతుల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా జరిపేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బుధవారం హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయుధ పోరాటాన్ని గుర్తించేందుకు ఆ రెండు పార్టీలు సిద్ధంగా లేవన్నారు. కానీ దానిపేరిట రాజకీయం చేస్తున్నాయని అన్నారు. ఆ పార్టీల నాయకులకు నార్కో టెస్టు చేస్తే నిజమేంటో బయటపడుతుందని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీ ఈనెల 17న నిర్మల్లో అమిత్షాతో సభ నిర్వహించేందుకు నైతిక హక్కు లేదని విమర్శించారు. ఆ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలను గుర్తించి పింఛన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా బీజేపీ చిత్రీకరిస్తున్నదని అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా మఖ్దూం మొహియుద్దీన్ పోరాడారని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంతో, సాయుధ పోరాటంతో బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. లాఠీదెబ్బలు తినలేదనీ, బ్రిటీష్ వారికి లొంగిపోయారని గుర్తు చేశారు. హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన విద్యాసాగర్రావు సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి పింఛన్ ఇచ్చేందుకు నిరాకరించారని చెప్పారు. తెలంగాణ రాకముందు సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని కేసీఆర్ ఎన్నో సార్లు అన్నారని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక నిర్వహించడం లేదన్నారు. వచ్చేనెల 2,3,4 తేదీల్లో ఢిల్లీలో తమ పార్టీ జాతీయ సమితి సమావేశాలు జరుగుతాయని అన్నారు. మహాసభల షెడ్యూల్ను ఖరారు చేస్తామన్నారు. జాతీయ మహాసభలు విజయవాడలో జరుగుతాయని వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డబుల్గేమ్ ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ స్వాతంత్య్ర దినంగా సెప్టెంబర్ 17ను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ బీజేపీ మత రాజకీయం చేస్తున్నదని అన్నారు. పోరాట యోధులను గుర్తించకుండా, వారికి పింఛన్ ఇవ్వకుండా, సాయుధ పోరాటాన్ని అధికారికంగా గుర్తించకుండా బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పారు. భూసమస్యలపై సమరశీల ఉద్యమాలు చేపడతామన్నారు. బండి సంజరుది ప్రజా సంగ్రామ యాత్ర కాదనీ, ప్రజా దగా యాత్ర అని ఎద్దేవా చేశారు. ఈనెల 11 నుంచి 17 వరకు యాత్ర చేస్తామనీ, అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తామని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్పాషా మాట్లాడుతూ దేశంలో శాంతిభద్రతల్లో యూపీ బెస్ట్ అని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించడం పెద్ద జోక్, పెద్ద అబద్ధమని అన్నారు.