Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోఠి డీహెచ్ ఆఫీసు ఎదుట నిరసన
- ప్రమోషన్లియ్యకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
నవతెలంగాణ-సుల్తాన్బజార్
నిబంధనల మేరకు స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులకు ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వ ఆస్పత్రుల నర్సుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సుధామణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని కోఠి డీఎంహెచ్ఎస్ ఆవరణలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) ఆఫీసు ఎదుట వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి హెడ్ నర్సులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నిబంధనల మేరకు 22 ఏండ్ల సర్వీసు పూర్తి చేసిన స్టాఫ్ నర్సులకు హెడ్నర్సుగా, ఏడేండ్లు సర్వీసు పూర్తి చేసిన హెడ్ నర్సులకు గ్రేడ్-2 అధికారిగా, రెండేండ్ల సర్వీసు పూర్తి చేసిన గ్రేడ్-2 అధికారులకు గ్రేడ్-1 అధికారులుగా ప్రమోషన్లు కల్పించాల్సి ఉందన్నారు. అయినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నర్సులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. సుమారు మూడు దశాబ్దాలపాటు సేవలందించిన హెడ్ నర్సులు, హెడ్ నర్సులుగానే ఉద్యోగ విరమణ పొందాల్సి వస్తోందని వాపోయారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదన్నారు. తమ సమస్యలను డీహెచ్కు వివరించేందుకు వరంగల్ నుంచి 20 మంది నర్సులం వచ్చామని తెలిపారు. అర్హులైన నర్సులకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల నర్సుల సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. డీహెచ్ అందుబాటులో లేకపోవడంతో వినతిపత్రాన్ని ఇన్ వార్డులో అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నర్సుల సంఘం అధ్యక్షురాలు రోజా నీల, కార్యనిర్వాహక అధ్యక్షురాలు డి.స్వరూప రాణి. ప్రధాన కార్యదర్శి పి.శైలజ, పలువురు హెడ్ నర్సులు పాల్గొన్నారు.