Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాటేదాన్ పారిశ్రామికవాడల్లో మగ్గుతున్న కార్మికులు
- పేదల శ్రమనే యాజమాన్యాలకు పెట్టుబడి
- క్లస్టర్ పరిధిలో 30 వేల మంది కార్మికులు
- అత్యధికులు మహిళా, వలస కార్మికులే..
- గంటకు కూలి రూ.20 మాత్రమే... అమలుకాని కార్మిక చట్టాలు
- యూనియనూ పెట్టుకోనివ్వని పరిస్థితి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి మైల సైదులు
కాటేదాన్ పారిశ్రామికవాడల్లో పనిచేస్తున్న కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిత్యం ప్రాణాని పణంగా పెట్టి పొట్టకూటి కోసం పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో యజమాని చెప్పిందే వేదం. ప్రశ్నించలేని ఆ కార్మికుల చెమట చుక్కలను అందిన కాడికి పిండుకుంటోంది యాజమాన్యం. రోజులో 12గంటలు పనిచేయించుకుంటూ రూ.200 కూడా చెల్లించడం లేదు. యూనియన్లు, చట్టాలు తెలియని కార్మికులతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాదం జరిగితే సాయం చేయండని వేడుకోవడం తప్ప న్యాయంగా హక్కుల కోసం అడగలేని పరిస్థితి. గొంతెత్తి అడిగితే.. తెల్లారి ఉన్న కూలి ఉంటుందో లేదో తెలియని దుస్థితి. యాజమాన్యాల గుప్పిట్లో బందీగా ఉంటూ శ్రమ దోపిడీకి గురవుతున్న కాటేదాన్ పారిశ్రామక వాడ కార్మికుల కన్నీటి గాథలపై నవతెలంగాణ కథనం. '18 ఏండ్లగా శ్రీరాం ప్లాస్టిక్ కవర్ తయారీ కంపెనీల్లో పనిచేస్తున్న. రోజుకు 12 గంటలు.. నెలలో 30 రోజులు పనిచేయాల్సిందే. ఒక్క రోజు పనికి రాకుంటే ఆ రోజు వేతనం ఇవ్వరు. రెండేండ్ల కింద లెబుల్ కంటింగ్ చేసే సమయంలో నా చేతి వేళ్లు తెగిపోయాయి. అయినా యాజమాన్యం పట్టించుకోలేదు. మా హక్కుల కోసం అడుగుదాం అంటే యూనియన్ లేదు. చట్టాలు ఎన్ని ఉన్నా మా వరకు రావడం లేదు. మేం ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తాం అంటూ యజమానులు బెదిరిస్తారు..' ఇదీ ప్లాస్టిక్ కవర్ తయారీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడి గౌతమ్ ఆవేదన. రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడల్లో చిన్న అగ్గిపూల్ల నుంచి మొదలు మెడిసిన్ తయారీ వరకు ముడి పదార్థాలు ఉత్పత్తి చేసే సంస్థలు ఉన్నాయి. దాదాపు 350 కంపెనీల్లో 30 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసే కార్మికుల్లో అత్యధికులు మహిళలే. సుమారు 18 వేల మంది మహిళా కార్మికులు ఈ క్లస్టర్ పనిచేస్తున్నారు. 12 వేల మంది పురుషులు ఉన్నారు. ఇందులో 10 వేల మంది కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు. జార్ఖండ్, మహారాష్ట్ర, బెంగాల్, బీహార్, ఒరిషా ప్రాంతాల కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలోని కంపెనీలు ఎక్కువగా రసాయనిక పదార్థాలతో కూడి పరికరాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్స్, డ్రమ్స్, మత్తుపానియాలు, మసాలాలు, బిస్కెట్, చాక్లెట్, మెడిసిన్ కంపెనీలు ఉన్నాయి. కంపెనీల్లో కార్మికుల ఆరోగ్యం పట్ల యాజమాన్యాలు జాగ్త్రతలు తీసుకోకపోవడంతో ప్రతియేటా వేలాది మంది కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా పూట గడువని పరిస్థితిలో పని చేయాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు. ''ప్లాస్టిక్ కవర్ తయారీ కంపెనీలో ఐదేండ్ల నుంచి పనిచేస్తున్నా.. రోజుకు 10 గంటలు పనిచేయాల్సిందే.. రోజు కూలి రూ.250 ఇస్తారు. వాళ్లు ఇచ్చినప్పుడే తీసుకోవాలి. లేదంటే పనికి రానివ్వరు. గత్యంతరం లేక ప్రాణం పణంగా పెట్టి పనిచేస్తున్నాం'' అంటూ ప్లాస్టిక్ కవర్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికురాలు మాధవి తన గోడు వెల్లబోసుకుంది.
గంటకు రూ.20 కూలి
పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసినా రూ.200 నుంచి 250 వరకు కూలి ఇచ్చే పరిస్థితి లేదని కార్మికులు వాపోతున్నారు. కనీసం భోజనం సమయం కూడా లెక్కలోకి తీసుకోకుండా పని చేసిందే లెక్కగడుతూ వేతనం చెల్లిస్తున్నారు. గంటకు రూ.20మాత్రమే చెల్లిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిండికేట్గా మారిన యాజమాన్యాలు
రాజేందర్నగర్ మండల పరిధిలోని రెండు క్లస్టర్లలో 300 కంపెనీలు ఉన్నాయి. ఒక్కో యజమాని పరిధిలో 10 నుంచి 20 కంపెనీలు ఉన్నాయి. ఒక్క దీక్షిత్ ఫూడ్ కంపెనీ పరిధిలోనే వివిధ పేర్లతో 15 కంపెనీలు ఉన్నాయి. ఇందులో సుమారు 6 నుంచి 7 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ యూనియన్ కూడా ఏర్పాటు చేయనిచ్చే పరిస్థితి లేదు. అందరూ సిండికెట్గా మారి కార్మికులను యూనియన్ పెట్టనివ్వకుండా.. కార్మికుల హక్కుల గురించి అడగనివ్వకుండా.. వారి శ్రమను దోచుకుంటున్నారు.
మా సేటు ఇచ్చింది తీసుకోవాలి: కలమ్మ- గాజు ముక్కల కంపెనీ కార్మికురాలు
డంపు చేసిన గాజు ముక్కల నుంచి ఏ కలర్కు ఆ కలర్ వేరుచేయాలి. ఈ డంపుల్లో దుమ్ము దూళి ఉంటుంది. ఎప్పుడూ ముక్కుకు బట్టకట్టుకుని పనిచేయాలి. గాజు ముక్కలను వేరు చేసే సమయంలో అజాగ్రత్తగా ఉంటే చేతులు తెగిపోసే ప్రమాదం ఉంది. పొద్దంతా కష్టపడితే ఇచ్చే కూలి రూ.200 మాత్రమే. మా సేటు ఇచ్చింది తీసుకోవాలి.
12 గంటలు పనిచేయాల్సిందే..:ననాక్- ఫైవుడ్ కంపెనీ వలస కార్మికుడు
రెండేండ్లుగా ఫ్లైవుడ్ కంపెనీల్లో పనిచేస్తున్న. రోజుకు 12 గంటలు పనిచేస్తేనే ఆ రోజు డ్యూటీ చేసినట్టు. గంట తప్పినా ఆ రోజు సగం జీతమే ఇస్తారు. పీఎఫ్, ఈఎస్ఐ లేదు. నాతో పాటు సుమారు 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 8 కంపెనీలు ఉన్నాయి. ఎక్కడా యూనియన్ పెట్టుకోనివ్వడం లేదు. కనీస వేతనం ఇవ్వడం లేదు.