Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ప్రశ్న
- డీహెచ్ కోర్టుకు రావాల్సి ఉంటుంది
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కరోనా కన్నెర్ర జేస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తే ప్రజల ప్రాణాలు ఏం కావాలంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వాలు తీరుబడిగా చర్యలు తీసుకునే వరకూ కరోనా శ్రద్ధగా స్పందించకుండా కూర్చుందాం అనుకుంటున్నారా? అని నిలదీసింది. ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసే వరకూ, మూడో దశను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకునే వరకూ వైరస్ వ్యాప్తి కాకుండా వేచి ఉండదంటూ వ్యాఖ్యానించింది. ఇప్పటికే రెండు దశల్లో ఎంతోమంది జనం చనిపోయారనీ, ఇప్పడు ప్రభుత్వాలు నెమ్మదిగా అడుగులు వేస్తూ ప్రణాళికలను రూపకల్పన చేస్తుంటే కరోనా కాటేస్తుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి వినోద్కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. కరోనాకు వాడే మందుల్ని లైఫ్ సేవింగ్ మెడిసిన్స్గా పరిగణించాలనే విషయంపై కౌంటర్ వేసేందుకు సమయం కావాలంటూ కేంద్రం, విపత్తుల నిర్వహణ చట్టం కింద ఉన్నత స్థాయి కమిటీ సమావేశాల తీర్మానాలు అందజేసేందుకు గడువు కావాలంటూ రాష్ట్రం కోరడంపై హైకోర్టు పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోకుండా నెమ్మదిగా ఆచీతూచీ వ్యవహిరిస్తే పరిణామాలు పెను విషాదానికి దారి తేసేందుకు ఆస్కారముంటుందని హెచ్చరించింది. మూడో దశ కరోనా కొన్ని రాష్ట్రాల్లో వ్యాప్తి చెందిందనే వార్తలు వస్తున్నాయనీ, అదేమీ అక్కడితో ఆగదనీ, మనకు కూడా వస్తే ఏం చేయాలో ముందస్తు ప్రణాళికలు లేకపోతే ఎలాగని ప్రశ్నించింది. గత నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను రెండు ప్రభుత్వాలు అమలు చేయకుండా ఇప్పుడు వాయిదా కావాలని కోరడమేంటని కూడా ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం నల్లగొండ, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ల ఫలితాలపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఉన్నత స్థాయి కమిటీ ఎప్పుడు సమావేశమైందో, ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు, సూచనలు చేసిందో, తీర్మానాలు ఏం చేసిందో చెప్పకుండా ఉంటే ఎలాగని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ వివరాలన్నీ వచ్చే వారం జరిగే విచారణ నాటికి ఇవ్వాలనీ, లేకపోతే హెల్త్ డైరెక్టర్ విచారణలో స్వయంగా వివరాలు అందజేయాలని చెప్పింది. అదే మాదిరిగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయకపోతే కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి కూడా ఆన్లైన్ విచారణకు హాజరై సంజాయిషీ చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్రంలో పడకలు, ఐసీయూ, వెంటిలేటర్లు, మందులు మొదలైనవి ఎన్ని ఉన్నాయో, ఎంతమేర వాటిని నిల్వలు చేశారో, పిల్లల కోసం పడకలు ఎన్ని ఉన్నాయనే అంశాలపై జిల్లాల వారీగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల వివరాలను పట్టిక రూపంలో అందజేయాలని రాష్ట్రానికి ఆదేశాలిచ్చింది. రెండు ప్రభుత్వాలు సీరియస్గా స్పందించాలని ఆదేశించింది. వైరస్ ఒక చోటే ఉండిపోదనీ, వేరే రాష్ట్రాల్లో ఉన్న మూడో దశ కరోనా మన రాష్ట్రానికి రాదనే గ్యారెంటీ ఏమీ లేదని వ్యాఖ్యానించింది. వైరస్ వచ్చే ప్రమాదం ఉంటుందనీ, ప్రజారోగ్యంతో ముడిపడిన విషయంలో ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలనీ, నెమ్మదిగా చర్యలు ఉంటే ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర తరఫున ఏజీ బిఎస్ ప్రసాద్ వాదిస్తూ రాష్ట్రంలో కరోనా బాగా తగ్గిందన్నారు. ఒక శాతం లోపే కేసులు ఉన్నాయన్నారు. ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. మూడో దశ నివారణకు ప్రణాళికలను సిద్ధం చేశామని వివరించారు. ఉన్నత స్థాయి కమిటీ తీర్మానాల ప్రతులను అందజేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో కోర్టు విచారణను ఈ నెల 22కి వాయిదావేసింది.ఇదిలా వుండగా కరోనాచికిత్సలు, పరీక్షల కోసం వసూలు చేసే చార్జీలను నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను సవాల్ చేసిన కేసులను కూడా హైకోర్టు విచారణ చేసింది. తెలంగాణ ఆస్పత్రులు, నర్సింగ్ హౌమ్స్ అసోసియేషన్ వేసిన రిట్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేంద్రానికి, రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వీటిపై విచారణను అక్టోబర్కు వాయిదా వేసింది.